న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత గత చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాలను రద్దు చేస్తూ నిర్ణయాలను తీసుకున్నది. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పిపిఎ) అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆ ఒప్పందాలను సమీక్షించాలనీ, రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ చర్యలు మంచివి కావని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో కొన్ని కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విదేశీ పెట్టుబడిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చే యోచన చేస్తున్నదని తెలుస్తుంది.
దీనిపై ఎపి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
నిరంకుశ ధోరణితో, ఏకపక్షంగా కాంట్రాక్టులు రద్దు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడిచేసేలా కేంద్రం చట్టం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపిలో పెట్టుబడిదారులపై వైఎస్ జగన్ ప్రతీకార రాజకీయాలు, వేధింపులు రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టడమే కాకుండా, దేశ వ్యాప్తంగా తమ ఒప్పందాల భవిష్యత్తు ఏంటని పెట్టుబడిదారుల మనసుల్లో అలజడి రేకెత్తిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
.@ysjagan’s vendetta politics & harassment of investors has not only led AP into a sinkhole, but has also created serious doubts in the minds of investors about the sanctity of agreements in the Country (1/2) pic.twitter.com/2vXDfrA6KY
— N Chandrababu Naidu (@ncbn) November 18, 2019