అమరావతి, ఏప్రిల్ 25: మే ఒకటవ తేదీ నుండి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పూర్తి కావడంతో ప్రత్యర్థుల కుట్రలు ముగియలేదనీ, ఫలితాల వెల్లడి అయ్యే వరకూ వైసిపి, బిజెపి కుట్రలు కొనసాగుతాయనీ చంద్రబాబు అన్నారు.
కౌంటింగ్ ఏజంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల ఓట్లలో తేడాలు ఉన్నాయనీ, కౌంటింగ్ పూర్తి వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు.
తన పోరాటాన్ని ఎవరు ఎలా ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చేది టిడిపియేనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇవిఎంలపై తాము చేసే పోరాటం అందరికీ స్పూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు.
దుర్మార్గుడు అధికారంలోకి రావడానికి ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని చంద్రబాబు విమర్శించారు.