కోల్ కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మమతా బెనర్జీ గట్టి సమాధానమే చెప్పారు. ప్రతిపక్ష నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని, మమతా దీదీ ప్రతి యేటా తనకు కుర్తాలు, బెంగాలీ స్వీట్లు పంపుతారని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై మమత వెంటనే స్పందించారు. ‘‘అతిథులను ఆహ్వానిస్తాం, వాళ్లకు రసగుల్లాలు, బహుమతులు కూడా ఇస్తాం. కానీ ఒక్క ఓటు కూడా వారికి ఇచ్చేది లేదు’’ అని ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండానే చెప్పారు. ప్రత్యేక సందర్భాలలో అతిథులను గౌరవించడం బెంగాలీల సంప్రదాయమని ఆమె అన్నారు.
హూగ్లీ జిల్లా సెరంపూర్ లోని ఒక ర్యాలీ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూను పలు చానళ్లు ప్రసారం చేశాయి. అందులోనే ఆయన మమతా బెనర్జీ స్వీట్లు, కుర్తాల బహుమతుల గురించి చెప్పారు. ‘‘నేను ఓ విషయం చెబితే ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎన్నికల సందర్భంలో ఇది చెప్పకూడదు కూడా. కానీ, మమతా దీదీ నాకు ప్రతియేటా బహుమతులు పంపుతారు. ఇప్పటికీ ఏడాదికోసారి ఆమె స్వయంగా ఎంపిక చేసి కొనుగోలు చేసి ఒకటి లేదా రెండు కుర్తాలు నాకు పంపుతారు. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రతియేటా నాకు కొత్త రకం స్వీట్లు పంపేవారు. ఒకసారి మమతా దీదీకి ఈ విషయం తెలిసింది. అప్పటినుంచి ఆమె కూడా నాకు ఏడాదికి ఒకటి రెండుసార్లు బెంగాలీ స్వీట్లు పంపడం మొదలుపెట్టారు’’ అని మోదీ చెప్పారు. ఆమెను తాను స్పీడ్ బ్రేకర్ దీదీ, స్టిక్కర్ దీదీ అనేది కేవలం రాజకీయాల వరకు మాత్రమేనన్నారు.