కాకినాడ, మార్చి 17: ‘రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం రాత్రీపగలు తేడా లేకుండా పని చేశా, ఇప్పుడు నా కష్టానికి కూలి అడిగేందుకు మీ ముందుకు వచ్చా, మీ ఓటుతో 150 పైగా సీట్లతో టిడిపిని గెలిపించి నాకు కూలి ఇస్తారని నమ్ముతున్నాను’ అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం చంద్రబాబు పర్యటించారు. విజయనగరం అయోధ్య మైదానంలో, కాకినాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. కాకినాడ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపి హర్షకుమార్ తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. వారికి చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు.
ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మళ్లీ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టాలని ప్రజలను చంద్రబాబు కోరారు.
రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు ఏకమయ్యారనీ, దుష్ట శక్తులు ఎన్ని ఏకం అయినా తెలుగుదేశం చారిత్రక విజయాన్ని అపలేరని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల యుద్ధంలో సర్వశక్తులతో పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దుష్టశక్తులను తరిమి కొట్టేందుకు మనం చేసిది ధర్మయుద్ధమని చంద్రబాబు పేర్కొన్నారు.
మాజీ ఎంపి,సీనియర్ నాయకుడు హర్షకుమార్ లాంటి నాయకుడు పార్టీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు అన్నారు.