(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దంతెవాడ: గాయపడిన ఒక మావోయిస్టు కమాండర్ను చత్తీస్గఢ్ పోలీసులు 12 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. మల్కనగిరి ఏరియా కమాండర్ మడకం హిద్మా ప్రస్తుతం దంతెవాడ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు జరుపుతుండగా తప్పించుకు పారిపోయే యత్నంలో హిద్మా ఒక గుంటలో పడ్డారు. ఆయన సహచరులు పారిపోయారు. కాలు విరిగిన హిద్మా తర్వాత అతి కష్టం మీద బయటకు వచ్చి దగ్గరున్న ఒక గ్రామంలో తలదాచుకున్నారు. అక్కడ గ్రామస్థులు అతనికి ఆకుపసర్లతో వైద్యం చేశారు.
ఈ సమాచారం తెలియడంతో డిఆర్జి పోలీసులు అక్కడకు వెళ్లారు. హిద్మా కాలు గాంగ్రేన్తో కుళ్లిపోయే పరిస్థితి ఉండడం చూసి ఆయనను దంతెవాడ తరలించాలని నిర్ణయించారు. ఆ దట్టమైన అడవిలో రవాణా సౌకర్యం లేకపోవడంతో హిద్మాను మంచంపై వేసి 12 కిలోమీటర్లు నడిచి రవాణా సౌకర్యం ఉండే ప్రాంతం చేరుకున్నారు. అక్కడ నుంచి దంతెవాడ చేరుకున్నారు. హిద్మాపై అయిదు లక్షల రివార్డు ఉంది.