హైదరాబాద్: ఆర్టిసి కార్మికులు 50 రోజులకుపైగా రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం జరిగిన కార్మికుల ఆత్మీయ సదస్సులో వరాలజల్లు కురిపించారు. ఆర్టిసి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సోమవారం సెప్టెంబర్ నెల జీతం చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం భరోసానిచ్చారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేట్ బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్లు లాభం ఆర్టీసీకి రావాలని కార్మికులకు సూచించారు. ప్రతీ ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష బోనస్ అందుకునే స్థితికి రావాలని సీఎం ఆకాంక్షించారు.
ఉద్యోగులు సమ్మెల పేరుతో సమస్యలను సృష్టించకుండా బాగా పనిచేసి ఆర్టిసిని లాభాల్లోకి తీసుకెళితే సింగరేణి తరహాలో ప్రతి ఏడాది బోనస్ కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆర్టిసి మనుగడ కోసం కష్టపడి పని చేయాలని కార్మికులకు కెసిఆర్ సూచించారు. బాగా పనిచేసి ఆర్టిసిని లాభాల్లోకి తీసుకొస్తే 52 రోజుల సమ్మె కాలానికి జీతం కూడా చెల్లిస్తామని ఆయన చెప్పారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలందిస్తామని ప్రకటించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రగతిభవన్లో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు.