కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అయిదు రోజుల రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం కడప జిల్లా రైల్వే కోడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అధికారపక్షాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. వారు ప్రజలకు మంచి చేస్తే అభినందిస్తాననీ, ప్రజలకు చెడు చేస్తే నిలదీస్తానని అన్నారు. రాయలసీమలో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉక్కు కర్మాగారం గురించి ప్రధాని మోదిని ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడగకుండా వారి కాంట్రాక్టర్లకు లాభం కల్గించే యురేనియం శుద్ధి కర్మాగారం గురించి అడిగారని ఆరోపించారు.
ముఖ్యంగా యువత పిరికితనం వదిలివేసి అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. వనరులు కొద్ది మంది చేతిలో ఉంటేనే విప్లవాలు వస్తాయని అన్నారు. అన్యాయం జరిగితే గొంతెత్తి అరవాలన్నారు. ప్రత్యర్థుల పంటలను నాశనం చేసే సంస్కృతి మంచిది కాదన్నారు. ఈ ప్రాంతంలో బత్తాయిచెట్లు నరికిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నా, వారికి వారికి అండగా ఉన్న వారు ఆ చెట్ల శాపం తగిలి సమూలంగా నాశనం అవుతారని హెచ్చరించారు.
దాడులు జరిపితే చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తిని కాదని అన్నారు. సినిమాలో కనిపించే పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అని చెప్పారు. తాను ఆశతో పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదనీ, ఆశయంతో వచ్చానని పవన్ అన్నారు. జనసేన కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఒక కులానికో మతానికో వంత పాడను, ఓడిపోయినా సత్యమే మాట్లాడతానని పవన్ అన్నారు. అవకాశ వాద రాజకీయాలు చేస్తూ ప్రజలతో ఆడుకునే వారు ఇప్పుడు ఎక్కువయ్యారని విమర్శించారు. తాను ఓడిపోవడానికి ఇష్టపడతాను కాని ప్రజలను మోసం చేయడానికి ఇష్టపడనని పవన్ అన్నారు. యువతలో ధైర్యం నింపడానికి పార్టీ పెట్టానని పేర్కొన్నారు, ఆశయం కోసం పని చేసే వారికి గెలుపు ఓటములు ఉండవని అన్నారు. వైసిపిలోనూ తన అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. వారు ఆ పార్టీ నాయకుడి పద్ధతులు మార్చుకోమని చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్యకు పెట్టుబడులు తీసుకురమ్మనమని చెప్పాలని అన్నారు.
రాయలసీమ సంస్కృతి అంటే నరుక్కోవడం కాదని అన్నారు. అత్యంత పురాతనమైన తెలుగు శాసనాలు మొదటగా దొరికింది పులివెందుల సమీపంలోనేనని చెప్పారు.
వైసిపికి 22మంది ఎంపిలు ఉన్నా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదని అన్నారు. ఈ ప్రాంతంలో పసుపు పంట రైతులను ఆదుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు ఎందుకు కట్టించలేకపోయారని ప్రశ్నించారు.
రైల్వే కోడూరులో స్థలం తీసుకొని చక్కడి గ్రంధాలయం నిర్మిస్తానని పవన్ తెలిపారు. జ్ఞానం ఉన్నవారికి అణువనువూ ధైర్యం ఉంటుందనీ అందుకే ఇక్కడ చక్కటి గ్రంధాలయం ఏర్పాటు చేస్తానని పవన్ చెప్పారు.