హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన, తాజా పరిణామాలపై చర్చించిస్తున్నారు. సమీక్ష సమావేశానికి రవాణా శాఖ మంత్రితోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. రూట్ పర్మిట్ల వివాదంపై శుక్రవారం హైకోర్టులో విచారణ ఉంది. ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. షరతులు విధించకపోతే విధుల్లోకి చేరేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు ఆర్టీసీలోని 5,100 రూట్లను ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం… ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో మళ్లీ కార్మికులు నిరసన తెలిపితే కష్టమవుతుందని… కాబట్టి కార్మికులు విధుల్లో చేరడానికి ముందే షరతులు విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సమ్మె, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంలో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.