(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ఆర్డర్ కాపీలు ప్రభుత్వానికి అందాయి. దీనిపై ఏం చేయాలనే అంశంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఓ వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే… మరోవైపు కార్మికులతో చర్చలు జరపాలని సీఎం కేసీఆర్ సమావేశంలో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చించేందుకు కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మిక సంఘాల నేతలు చర్చించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమ్మె విరమించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి డిమాండ్లను పక్కనపెడితేనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు అక్టోబరు 5 నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కేసీఆర్… ఇక ఆర్టీసీలో మిగిలింది 1200 మంది మాత్రమేనని, 48 వేల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయినట్టేని చెప్పారు. అంతేకాదు.. కొత్త వారిని నియమించుకోవడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దానిలో భాగంగానే.. తాత్కాలిక నియామకాల పేరుతో డ్రైవర్లను, కండక్టర్లను నియమించుకుంది ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మె విరమించే ప్రస్తకే లేదని తేల్చి చెప్పారు. అయితే, కొంతమంది కార్మికులు.. ఉద్యోగం పోయిందన్న భయంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు గుండె సంబంధిత వ్యాధులకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదీకాక.. దసరా ముందు సెప్టెంబరు నెల జీతాలు రాకపోవడం ఆర్టీసీ కార్మిక కుటుంబాలను మరింత కుంగదీసింది. అయితే, తాజాగా కోర్టు ఆదేశాలు, గవర్నర్ కు ఫిర్యాదు అందడంతో కేసీఆర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.