హైదరాబాద్:గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడానికి దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట నిర్మించాలని ఉభయ తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయం గా అంగీకరించాయి. గోదావరి జలాల తరలింపు పై ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీ చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు కెసిఆర్, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఆనకట్ట నిర్మించే అంశం పై మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజనీర్ల కమిటీకి సియంలు ఆదేశించారు.
ప్రగతిభవన్లో సోమవారం తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్, ఏపి ముఖ్య మంత్రి జగన్ దాదాపు నాలుగు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలపై చర్చించారు. గోదావరి, కృష్ణా నది జలాల సంపూర్ణ వినియోగం, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ లోని సంస్థలపైన ఇద్దరు ముఖ్య మంత్రులు చర్చించారు.
ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు తదితర విషయాలను వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది,
ముందుగా లోటస్ పాండ్ నుండి ప్రగతి భవన్ కు చేరుకున్న ఏపి సిఎం జగన్ ను కెసిఆర్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను కెసిఆర్ కు జగన్ అందజేశారు.