తాజాగా శేఖర్ రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం టిటిడి బోర్డు లోకి తీసుకున్న తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన కథనం
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఇటీవల కాస్త నానిన వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్టు బోర్డు నియామకాలు. మూడు నెలల క్రితం బాబాయి వైవి సుబ్బారెడ్డిని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న 24 మంది సభ్యులతో జంబో ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగక మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వారిలో తమిళనాడుకు చెందిన ఎజె శేఖర్ రెడ్డి ఒకరు. దీనితో మొదలయింది వివాదం.
సోషల్ మీడియా శక్తియుక్తులను తక్కువ అంచనా వేస్తే ఎంతటి వారికైనా శృంగభంగం తప్పదనడానికి శేఖర్ రెడ్డి ఉదంతమే నిదర్శనం. శేఖర్ రెడ్డిని ట్రస్టు బోర్డులోకి తీసుకుంటున్న విషయం వీలైనంతవరకూ గోప్యంగా ఉంచాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్లున్నారు. ఆయన పేరును ఉత్తర్వులలో ఎజె శేఖర్ రెడ్డి అని కాకుండా శేఖర్ ఎజె అని పేర్కొన్నారు. ఈ జాగ్రత్త సోషల్ మీడియా కళ్లు కప్పగలుగుతుందా?
వెంటనే మొదలయింది గుట్టు విప్పడం. గతంలో చంద్రబాబు నాయుడు ఇదే శేఖర్ రెడ్డిని టిటిడి ట్రస్టు బోర్డు సభ్యుడిగా నియమించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్ రెడ్డి చెన్నై నివాసంలో పెద్ద ఎత్తున నగదు, బంగారం బయటపడ్డాయి. అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసిపి వెంటనే రంగంలోకి దిగింది. ఆ పార్టీ ఆధికార ప్రతినిధి అంబటి రాంబాబు శేఖర్ రెడ్డితో చంద్రబాబుకు ముడి పెట్టారు. శేఖర్ రెడ్డి దగ్గర దొరికిందంతా శశికళ, లోకేష్ బినామీ సొమ్మేనని ఆరోపించారు. ఆతనికి టిటిడి ట్రస్టు బోర్డులో సభ్యత్వం ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఎవరో చెప్తే ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ‘పచ్చ పుట్టలో నల్ల తాచు’ పేరుతో సాక్షి ఛానల్లో ఒక అరగంట కార్యక్రమం నడిపింది. శేఖర్ రెడ్డి దగ్గర నారా లోకేష్ వంద కోట్ల రూపాయలు తీసుకుని టిటిడి పదవి ఇచ్చారని చెప్పుకుంటున్నట్లు ఆ కార్యక్రమంలో పేర్కొన్నారు. వందల కోట్లు ఇప్పటికే దొరికాయనీ, దొరికిన వాటికి వందల రెట్లు ఇంకా ఉన్నాయనీ సాక్షి రిపోర్టు చేసింది. శేఖర్ రెడ్డి హైదరాబాద్ వస్తే ఐదు నక్షత్రాల హోటల్లో చంద్రబాబు ఆయనను కలుస్తారని పేర్కొన్నది. బాబుకు చెందిన నల్లడబ్బు మార్చిన కారణంగానే శేఖర్ రెడ్డి దగ్గర అంత నగదు దొరికిందని సాక్షి పేర్కొన్నది.
గతంలో శేఖర్ రెడ్డి నివాసంలో నగదు దొరికినపుడు సాక్షి ఛానల్ ప్రసారం చేసిన కార్యక్రమం
శేఖర్ రెడ్డి దగ్గర నగదు దొరకగానే చంద్రబాబు ప్రభుత్వం ఆయనను టిటిడి బోర్డు నుంచి తొలగించింది. ఇప్పుడు అదే శేఖర్ రెడ్డిని జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితుడి రూపంలో టిటిడి బోర్డు లోకి తీసుకుంది. విచిత్రంగా సాక్షి మీడియా గతంలో శేఖర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలన్నీ అపనిందలేనని తేల్చేసింది. సాక్షి దినపత్రికలో ‘అపనిందలు అధిగమించి శ్రీవారి చెంతకు’ అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది.
శేఖర్ రెడ్డి నీతి నిజాయితీలకు మారు పేరని ఆ కథనంలో పేర్కొన్నారు. రోజుకు కోట్లలో టర్నోవర్ జరిగే వ్యాపారం ఆయన సొంతమని తెలిపారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సిఫారసుతో ఆయనను టిటిడి బోర్డులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో శేఖర రెడ్డి ఇంటిపై దాడి జరిపిన ఆదాయం పన్ను శాఖ వారు స్వాధీనం చేసుకుంది 12 లక్షల రూపాయలు మాత్రమేనని సాక్షి ఈ కథనంలో తెలిపింది.
‘ఒకటా రెండా ఎన్ని అపనిందలు, మరెన్నో అక్రమ కేసులు..అన్నిటి నుంచీ బయటపడి శ్రీవారి చెంతకు చేరుకున్నార’sని సంతోషం వ్యక్తం చేసింది. ఈ విధంగా సాక్షి మీడియా గతంలో తాము రిపోర్టు చేసిన దానిని భిన్నంగా శేఖర్ రెడ్డి తాజా నియామకం దృష్ట్యా ఇప్పుడు ఆపరేషన్ కవర్ అప్ ప్రారంభించింది. అయితే ముందే చెప్పినట్లు సోషల్ మీడియాను తక్కువ అంచనా వేసింది.