మీలా ప్రచారం చేసుకోలేదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: యూపీఏ పాలనా కాలంలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైకులు చేశామని, కానీ సైనిక చర్యలను తామెప్పుడూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ చేసిన సర్జికల్ స్ట్రైకులు ఎవరికి తెలియవు, కనిపించవని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించడంతో విలేకరుల సమావేశం పెట్టి మరీ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.
పూంఛ్ లోని భట్టల్ సెక్టార్లో 2008 జూన్ 19న, కేల్లో నీలం నదీలోయ వద్ద శారదా సెక్టార్లో 2011 ఆగస్టు 30- సెప్టెంబరు 1 తేదీల మధ్య, సవాన్ పాత్రా చెక్ పోస్టు వద్ద 2013 జనవరి 6న, నాజాపీర్ సెక్టార్లో 2013 జూలై 27, 28 తేదీలలో, నీలమ్ లోయలో 2013 ఆగస్టు 6న, మరోటి 2013 డిసెంబరు 23న చేసినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు. అంతకుముందు వాజ్ పేయి ప్రధానిగా ఉండగా ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరిగిన మరో రెండు సర్జికల్ స్ట్రైకుల గురించి కూడా ఆయన చెప్పారు. అవి నీలం నది వెంట నదాలా ఎన్ క్లేవ్ వద్ద 2000 జనవరి 21న, పూంఛ్ లోని బరో
సెక్టార్లో 2003 సెప్టెంబరు 18న జరిగాయన్నారు.
యూపీఏ హయాంలోనూ సర్జికల్ స్ట్రైకులు జరిగాయని హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదులపై మన్మోహన్ కఠినంగా వ్యవహరించలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. యూపీఏ విడుదల చేసిన 25 మంది ఉగ్రవాదుల్లో ఒకరు తర్వాత పఠాన్ కోట్ ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని అన్నారు.
ఒక మాజీ ప్రధాని, ఒక ఆర్మీ మాజీచీఫ్ చెబుతున్నా కూడా ఆర్థిక మంత్రికి మాత్రం సర్జికల్ స్ట్రైకులు కనిపించలేదని కాంగ్రెస్ ప్రతినిధి రాగిణీనాయక్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు వాజ్ పేయి, మన్మోహన్ ల మీద ప్రశ్నలు వేయడమే కాక, ఆర్మీ మీద కూడా మచ్చ తెస్తున్నాయని ఆమె అన్నారు. మన్మోహన్ సింగ్ గానీ, వాజ్ పేయి గానీ తమ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైకుల గురించి ఎప్పుడూ చెప్పలేదని రాజీవ్ శుక్లా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సైనిక చర్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడలేదన్నారు.