అమరావతి: మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
‘ఎన్నికలకు ముందు వైసిపిలో చేరాలని ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. వైసిపిలో చేరడానికి ముందు నా భర్త వెంకటేశ్వరరావు నేను బిజెపిలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారు. అందుకు వైసిపి నేతలు అంగీకరించిన తరువాతే నా భర్త, కుమారుడు ఆ పార్టీలో చేరారు. వైసిపి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావును అడగండి’ అని పురందీశ్వరి అన్నారు.
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా దగ్గుబాటి కుటుంబ రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపి నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగుతున్నా ఆయనకు ఎటువంటి సమాచారం లేకుండా గత ఎన్నికల్లో దగ్గుబాటి ఓటమికి కారణమైన రావి రామనాధంను పార్టీ అధినేత, సిఎం జగన్మోహనరెడ్డి వైసిపిలో చేర్చుకోవడంపై దగ్గుపాటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో భార్య, భర్త (దగ్గుబాటి దంపతులు) ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని జగన్మోహనరెడ్డి అభిప్రాయంగా ఉందని ఆ జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల దగ్గుబాటి వర్గీయులకు తెలియజేశారు.
పురందేశ్వరి వైసిపిలోకి వస్తే సాదరంగా ఆహ్వానించి సముచిత స్థానం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వైసిపిలో చేరాలని వస్తున్న ఒత్తిడిపై ఇంత వరకూ నోరు మెదపని పురందేశ్వరి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మొదటి సారిగా స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసిపికి గుడ్బై చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యనేతలకు ఫోన్లోనే చెప్పినట్లు సమాచారం. వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రత్యేకంగా ప్రకటించేందుకు కూడా దగ్గుబాటి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇకపై ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం.