అమరావతి, మార్చి 11: ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి నాయకుల వలసలు సహజం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ నుండి ప్రజా ప్రతినిధులు, వారి బంధువులు ఎక్కువగా ప్రతిపక్ష వైసిపిలో చేరుతున్నారు. వైసిపితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు అధికార పార్టీలోకి జంప్ చేస్తున్నారు.
గత నెలా పదిహేను రోజులుగా చూసుకున్నట్లయతే టిడిపి నుండి మాజీ మంత్రి ఖలీల్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, పారిశ్రామికవేత్తలు దాసరి జైరమేష్, నార్నే శ్రీనివాసరావు, రఘురామకృష్ణంరాజు, అమలాపురం, అనకాపల్లి ఎంపిలు రవీంద్రబాబు, ఆవంతి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు, ప్రముఖ సినీ నటి జయసుధ, హాస్యనటుడు ఆలీ తదితరులు వైసిపిలో చేరారు. దీనికి తోడు ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల రక్తసంబంధీకులు, బంధువులు కూడా ప్రతిపక్షంలో చేరుతున్నారు. హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సోదరుడు, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సోదరుడు, బావ, తాజాగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖరరావులు వైసిపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి వైసిపిలో చేరారు.
కాగా వైసిపి నుండి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పారిశ్రామిక వేత్త ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, భీమిలి ప్రాంతానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుడు ఘంటా మురళి తదితరులు టిడిపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ కేంద్ర మంత్రులు సీనియర్ నాయకులు కోట్ల సూర్యప్రకాశరెడ్డి, కిషోర్ చంద్రదేవ్లు టిడిపిలో చేరారు.
సత్యనారాయణ, పలువురు మేధావులు, విద్యావంతులు, తటస్థులు చేరారు.
అధికార ప్రతిపక్ష పార్టీలలో అభ్యర్థిత్వాల ఖరారు తరువాత వలసలు మరింతగా ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టికెట్లు ఆశించి భంగపడిన వారు ప్రత్యర్థి పార్టీల్లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి.
అధికార పార్టీ నుండి జరుగుతున్నవలసలపై బెదిరింపులకు గురి చేసి పార్టీలోకి తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో వ్యాపార లావాదేవీలు, అస్తులు ఉన్న వారిపై టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఒత్తిడి తెచ్చి ఈ రకమైన కుట్రలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.
ఎవరు పార్టీ వీడి వెళ్లినా పార్టీ క్యాడర్ పార్టీ పై నమ్మకంతోనే ఉందని, కెసిఆర్, జగన్, మోదిలు ఎన్ని కుట్రలు చేసినా ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి నాంది పలుకుతాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నేడు ఎన్నికల వేళ తాము ప్రకటించిన నవరత్న పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తే జనం నమ్మి ఓట్లు వేయరని, ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు గుణ పాఠం చెప్పడం ఖాయమనీ, రాబోయేది తమ ప్రభుత్వమేనని వైసిపి అధినేత జగన్ పేర్కొంటున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి రాజకీయాల్లోకి రాలేదని, సమాజంలో మార్పు కోసమే వచ్చానని పేర్కొంటున్నారు. ప్రజలు దీవిస్తే అన్ని వర్గాలకు మంచి పాలన అందిస్తానని హమీ ఇస్తున్నారు.