(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: యావత్ దేశ ప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్న ఢిల్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి దేశ రాజధాని ప్రజల ఆశీస్సులు అర్ధిస్తున్న ఈ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టాయి. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 52 సీట్ల వరకూ రావచ్చనీ, బిజెపికి 17 సీట్లు, కాంగ్రెస్కు మిగిలిన ఒక్క సీటు రావచ్చనీ ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.
శనివారం ఉదయం నుంచీ పోలింగ్ మొదట మందకొడిగా సాగింది. ఈ మందకొడి పోలింగ్ దేనికి సంకేతం అంటూ పరిశీలకులు అంచనాలు వేస్తుండగానే పోలింగ్ పుంజుకుంది. పోలింగ్ ముగిసేసరికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 67.08 శాతం వోట్ల పోలయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో 67.5 శాతం పోలింగ్ నమోదయింది.
2015 ఎన్నికలలో ఢిల్లీ శాసనసభలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67 సీట్లే గెలుచుకున్నది. మూడు సీట్లతో బిజెపి ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నది. ఈసారి ఆ పరిస్థితి మార్చాలన్న కృత నిశ్చయంతో నరేంద్ర మోదీ, అమిత్ షాతో సహా 40 మంది స్టార్ కాంపైనర్లను బిజెపి రంగంలోకి దించింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
అంతకు ముందు: 18:28 గంటలు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. కానీ పోలింగ్ శాతం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 40.18శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 28శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 42 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 1.47కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆశిస్తుండగా ఎలాగైనా డిల్లీ గద్దెనెక్కాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. 2015తో పోల్చుకుంటే ఈ ఏడాది ఓటింగ్ సరళి చాలా తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో 62.2 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు.