(
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని గ్రామాల పర్యటన ఖరారు అయింది. ఈ నెల 15న పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నేడొక ప్రకటనలో తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో 53 రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.తొలి నుండి రాజధాని గ్రామాల రైతులకు అండగా ఉంటానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక పర్యాయం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకునివెళ్ళి రాజధాని తరలింపు అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
బిజెపితో పొత్తు పెట్టుకున్న తరువాత తొలి సారిగా పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. రాజధాని అంశం రాష్ట్రానికి సంబందించిన విషయమనీ, కేంద్రం జోక్యం చేసుకోదనీ బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు తొలి నుండి చెబుతున్నారు. మరో పక్క బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బిజెపి నాయకత్వం తీర్మానం కూడా చేసింది.
రాజధాని విషయంలో బిజెపి నేతల భిన్న వాదనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చే భరోసాను అమరావతి రైతులు నమ్ముతారా?. రాజధాని విషయంలో కేంద్రం రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తుందనీ, పార్టీ పరంగా పోరాటం చేస్తామనీ బిజెపి నేతలు చెబుతుండటంతో రాజధాని రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో రైతులకు ఏవిధంగా భరోసా కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరో పక్క పరిపాలన వికేంద్రీకరణ పనులు జరుగుతూనే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే వెల్లడించారు.