(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ ఛార్జిల భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా విద్యుత్ చార్జిలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్కు 90 పైసలు చొప్పున పెంచింది. 500 యూనిట్లు పైబడిన వారికి గతంలో తొమ్మిది రూపాయల అయిదు పైసలుగా ఉండగా ప్రస్తుతం తొమ్మిది రూపాయల 95 పైసలుగా టారిఫ్ నిర్ణయించారు. విద్యుత్ ఛార్జీల పెంపు భారం కార్పొరేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1.35లక్షల గృహ వినియోగదారులపై పడనున్నది.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సింగరేణి భవన్లో ఏపీ ఈ ఆర్ సి ఛైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి 14,349.07 కోట్ల రూపాయలు ఆదాయం అవసరమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈలోటును భర్తీ చేసేందుకు విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు 1300 కోట్ల రూపాయల భారం పడుతుందని అన్నారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి 2,893.48 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటు 10,060.63 కోట్ల రూపాయలుగా నిర్థారించినట్లు తెలిపారు. వ్యవసాయ వినియోగదారులకు 8,353.58 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపామని చెప్పారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందనీ, అందువల్లే ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతి నిరాకరించామనీ చెప్పారు. ఈసారి వ్యవసాయానికి పక్కా ప్రణాళిక రూపొందించామనీ, ప్రభుత్వ పాలసీ ప్రకారం రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామనీ తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందనీ, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామనీ చెప్పారు. లోటు పాట్లు ఉంటే వచ్చే ఏడాది సరిదిద్దుకుంటామని ఆయన వివరించారు.