హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ‘చలో ట్యాంక్బండ్’ కార్యక్రమం శనివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్బండ్ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్ … డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన రక్షణ వలయాలను దాటుకుని ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ట్యాంక్బండ్పై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్ల పైనుంచి దూకి మరీ వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఓయూ జేఏసీ నేతలు ట్యాంక్ బండ్పై సొమ్మసిలి పడిపోయారు. ఈఘటనలో పలువురు భద్రతా బలగాలకు గాయాలయ్యాయి.
చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకుని, ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో 300 మందికిపైగా కార్మికులను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ క్రాస్రోడ్డు నుంచి తమ్మినేని వీరభద్రం, విమలక్క ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్రోడ్డులో పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ట్యాంక్ బండ్ వైపు నాయకులు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎంబీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ కు వస్తోన్న సీపీఎం నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వీరభద్రం, జూలకంటి, విమలక్క తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంక్ బండ్ కు చేరుకునే అన్ని దారులను మూసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి వచ్చే కార్మికులను, ఓయూ నుంచి వచ్చే విద్యార్థులను అడ్డుకునేందుకు పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావును హిమాయత్ నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైరతాబాద్ వద్ద సీపీఐ నేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు చలో ట్యాంక్బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ… అరెస్ట్ల ద్వారా ఉద్యమాలను అణచలేరన్నారు. మిలియన్ మార్చ్తోనే కేసీఆర్ పతనం ప్రారంభం అయిందని, ప్రగతి భవన్ గడీలను బద్దలు కొడతామని హెచ్చరించారు.
సీఎం డౌన్… డౌన్ అంటూ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందంటూ కార్మికులు సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వ ఆస్తులను రాసివ్వమని అడగటం లేదని, న్యాయమైన డిమాండ్లు సాధన కోసమే సమ్మెకు దిగామని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తమకు జీతాలు లేవని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తే… బిడ్డలను ఇలాగేనా చూసేది అంటూ మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్బండ్ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్లో హౌస్ అరెస్ట్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు.