న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గాంధీ నెహ్రూ కుటుంబం వెలుపల నుంచి ఎవరినన్నా ఊహించడానికి కూడా కుదరని ఆ పార్టీలో, రాహుల్ గాంధీ స్థానంలో తాను అధ్యక్ష పదవి స్వీకరిస్తానని ఒకరు ముందుకు వచ్చారు. హాకీ క్రీడలో ఇండియా తరపున ఒలింపిక్స్లో ఆడిన క్రీడాకారుడు, మాజీ కేంద్ర మంత్రి అస్లాం షేర్ఖాన్ ఈ ప్రతిపాదన చేశారు.
2019 లోక్సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ నాయకత్వ బాధ్యత నుంచి తప్పుకుంటానన్న రాహుల్ తన ఆలోచనన మార్చుకునే దాఖలాలు కనబడడం లేదు. పార్టీ నాయకత్వం నుంచి ఈ దశలో తప్పుకోవద్దంటూ వర్కింగ్ కమిటీ ఆయనను కోరింది. అయినా రాహుల్ పట్టు వీడడం లేదు. రాహుల్ ఆలోచన మారనట్లయితే రెండేళ్ల పాటు పదవిలో ఉంటానని తాను లేఖ రాసినట్లు షేర్ఖాన్ ఎఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు.
తాను వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఈ ప్రతిపాదన చేయడం లేదనీ, కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు చేసే ప్రయత్నమేననీ ఆయన అన్నారు. పార్టీ పరాజయానికి రాహుల్ కారణం కాదనీ, ఆయన శాయశక్తులా ప్రయత్నించారనీ షేర్ఖాన్ పేర్కొన్నారు. తన కన్నా సమర్ధుడు ఎవరన్నా ముందుకు వస్తే అతనికే నాయకత్వం అప్పగించాలని ఆయన కోరారు.