మీరట్: తనను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులకు మద్యం తాగించి.. జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ తప్పించుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 1996లో ఒక న్యాయవాదిని చంపినందుకు బద్దన్ సింగ్ అలియాస్ బడ్డో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడిని పోలీసులు ఘజియాబాద్ కోర్టుకు తీసుకెళ్తున్నారు. దారిలో ఢిల్లీ రోడ్డులో తన అనుచరులు మందుపార్టీ ఇస్తున్నారని తనకు ఎస్కార్టుగా వస్తున్న పోలీసులకు అతడు చెప్పాడు. దాంతో వాళ్లు కూడా అతడితో పాటు తాగేందుకు వెళ్లి, అక్కడ మత్తులో ఉండగా బద్దన్ సింగ్ తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనలో అతడికి ఎస్కార్టుగా వెళ్లిన ఇన్ స్పెక్టర్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వాళ్లింకా మత్తులోనే ఉన్నారని మీరట్ సీనియర్ ఎస్పీ నితిన్ తివారీ తెలిపారు. బడ్డోపై హత్య, దోపిడీ సహా మొత్తం పది కేసులు ఉన్నాయని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు. తాము అదుపులోకి తీసుకున్నవారిలో కానిస్టేబుళ్లు ఓంవీర్, సంతోష్, సునీల్, రాజ్ కుమార్, భూపీందర్, ఇహెతషమామ్, ఫరూకాబాద్ ఇన్ స్పెక్టర్ దేశ్ రాజ్ త్యాగి ఉన్నారన్నారు.
క్రైం బ్రాంచి అధికారి సంజయ్ మిశ్రాను దీనిపై విచారణాధికారిగా నియమించారు. బడ్డోను మీరట్ పోలీసులు గత సంవత్సరం అరెస్టుచేశారు. అతడిని తొలుత ఒక నెల పాటు మీరట్ జైల్లో ఉంచి తర్వాత ఫతేగఢ్ జైలుకు తరలించారు. ఆస్ట్రేలియాలో ఎంబీయే చదువుతున్న తన కొడుకు సికిందర్ నెల రోజుల సెలవు కోసం మీరట్ వచ్చాడని, అతడిని చూసేందుకు పెరోల్ ఇవ్వాలని బద్దన్ సింగ్ సుప్రీంకోర్టును కోరాడు. అతడి పెరోల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉండగానే తప్పించుకున్నాడు.