బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను వానపాములతో పోల్చిన టీచర్ సస్పెండయ్యారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతుకు స్నేహితుడు ఎవరన్న ప్రశ్నకు మల్టిపుల్ ఆప్షన్లుగా కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప అనే సమాధానాలు ఇచ్చారు. వాటిలో ఒకటి ఎంచుకోవాలని 8వ తరగతి విద్యార్థులను కోరారు. ఈ ప్రశ్నపత్రం రూపొందించిన టీచరును ఉద్యోగం నుంచి తొలగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాఘవేంద్ర తెలిపారు.
కన్నడ భాషలో ఇచ్చిన ఈ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్ గా తిరిగింది. తమకు తెలియకుండానే ఈ ప్రశ్న పేపరులో వచ్చేసిందని ప్రిన్సిపాల్ అన్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తనను తాను రైతుబంధు అని చెప్పకొంటారు. అలాగే సీఎం కుమారస్వామి రైతు నాయకుడిగా ప్రకటించుకుంటారు. కుమారస్వామి పార్టీ జేడీఎస్ జెండా మీద ఒక మహిళా రైతు బొమ్మ ఉంటుంది.