న్యూఢిల్లీ: ఏడాదికి దాదాపు రూ. 12 కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో ఢిల్లీ లోక్ సభ బరిలో ఉన్న అభ్యర్థులందరిలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా తేలారు. ఆప్ అభ్యర్థి అతిషి మార్లెనా మీద తూర్పు ఢిల్లీలో పోటీ చేస్తున్న గంభీర్.. తన వార్షికాదాయం రూ. 12.4 కోట్లని 2017-18 ఆదాయపన్ను రిటర్నులలో చూపించారు. వాయవ్య ఢిల్లీలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి, గాయకుడు హన్స్ రాజ్ హన్స్ తన ఆదాయం రూ. 9.28 లక్షలని 2017-18 ఆదాయపన్ను రిటర్నులలో తెలిపారు. ఆయనపై పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ లిలోతియా మాత్రం రూ. 26.34 లక్షల వార్షికాదాయం పొందుతున్నారు.
దక్షిణ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ వార్షికాదాయం రూ. 45 లక్షలు. తనకు రూ. 3.57 కోట్లు, రూ. 5.05 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు కూడా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ ఎంపీ, దక్షిణ ఢిల్లీ అభ్యర్థి రమేష్ బిదురికి చర, స్థిరాస్తులు రూ. 18 కోట్లున్నాయి. గత ఐదేళ్లలో వీటి విలువ రూ. 3.5 కోట్లు పెరిగింది. బిదురి, ఆయన భార్య, కొడుకు హిమాన్శు కలిపి రూ. 16.72 లక్షలు, రూ. 3.09 లక్షలు, రూ. 3.18 లక్షల చొప్పున ఆదాయం చూపించారు.
మాజీ ముఖ్యమంత్రి, ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్ తనకు రూ. 4.92 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చెప్పారు. ఆమె వార్షికాదాయం రూ. 15 లక్షలుగా ఉంది. నిజాముద్దీన్ ప్రాంతంలో తనకు రూ. 1.88 కోట్ల విలువైన అపార్టుమెంటు ఉందన్నారు. న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ తన వార్షికాదాయం రూ. 26.38 లక్షలుగా ప్రకటించారు.