న్యూఢిల్లీ: రాజకీయేతర అంశాలపై తనను ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవ్వుల్లో ముంచెత్తారు. ట్విటర్ లో తాను అక్షయ్ తో పాటు ఆయన భార్య ట్వింకిల్ ఖన్నాను కూడా ఫాలో అవుతానని చెప్పారు. ‘‘ఆమె నన్ను టార్గెట్ చేసే విధానం చూస్తే మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగుతోందని నాకు అర్థమైంది. ఆమె కోపం అంతా నామీదే తీర్చేసుకుంటారు కాబట్టి, మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండి ఉండాలి’’ అనడంతో అక్షయ్ కుమార్ నవ్వు ఆపుకోలేకపోయాడు. మాజీ నటి, ప్రస్తుతం వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న ట్వింకిల్ పలు అంశాలలో ప్రధాని మోదీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కాగా, ప్రధాని చెప్పిన అంశానికి కూడా ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ట్విటర్ లో ‘మిసెస్ ఫన్నీ బోన్స్’ అనే పేరుతో ఉండే ఆమె.. దీనికి సమాధానం ఇచ్చారు. ‘‘దీన్ని నేను చాలా పాజిటివ్ పద్ధతిలో తీసుకుంటాను. నేను ఉన్నానన్న విషయం ప్రధానమంత్రికి తెలియడమే కాదు, ఆయన నా విషయాలన్నీ చదువుతారు కూడా’’ అని ఆమె అన్నారు.
I have a rather positive way of looking at this-Not only is the Prime Minister aware that I exist but he actually reads my work 🙂 ? https://t.co/Pkk4tKEVHm
— Twinkle Khanna (@mrsfunnybones) April 24, 2019
‘మిసెస్ ఫన్నీబోన్స్’ అనే పేరుతో వెలువరించిన పుస్తకంతో పాటు పలు పుస్తకాలు కూడా రాసిన ట్వింకిల్ ఖన్నా చాలా సరదాగా ఉంటారు. బీజేపీ మథుర అభ్యర్థిని, మాజీ నటి హేమ మాలిని ట్రాక్టర్ నడుపుతున్న ఫొటోను ట్యాగ్ చేస్తూ ఏప్రిల్ 21న ఆమె ఒక ట్వీట్ చేశారు. ఎండలు మండిపోతుండటంతో ట్రాక్టర్ మీద డ్రైవర్ సీటుకు అటూ ఇటూ రెండు ఫ్యాన్లను కూడా బిగించారు. ‘‘1000 పదాలలో 4 బొమ్మలను పెయింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంతరిక్షంలోని కృష్ణబిలం తమదేనని చెబితే, ఎవరిని తప్పుబట్టాలో మీకు తెలుసు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
తాను కూడా ట్విటర్ పోస్టులు చదివి నవ్వుకుంటానని ప్రధాని మోదీ నవ్వుతూ చెప్పారు. అప్పుడు అక్షయ్ కుమార్ తన వద్ద ఉన్న ఒక ట్యాబ్ తీసుకుని, దాంట్లో ప్రధాని మోదీ మీద వచ్చిన కొన్ని మీమ్ లను చూపించారు. వాటి గురించి ఏమంటారని ప్రశ్నించారు. వాటిని తాను ఎంజాయ్ చేస్తానని మోదీ బదులిచ్చారు. అందులో తాను మోదీ గురించి తక్కువగా ఆలోచించి, వారి సృజనాత్మకతను చూస్తానని అన్నారు. సోషల్ మీడియా వల్ల ఉన్న అతిపెద్ద ప్రయోజనం.. సామాన్య ప్రజల ఆలోచనల గురించి తెలియడమేనని ప్రధాని చెప్పారు.