అమరావతి: గోదావరి వరదల సహాయక చర్యల విషయంలో అధికారపక్షం మీద ప్రతిపక్షమైన టిడిపి పైచేయి సాధించింది. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేవీపట్నం ప్రాంతంలోని గ్రామాల ముంపు విషయంపై వెంటనే స్పందించారు. గతానికి భిన్నంగా తక్కువ వరద మట్టం స్థాయిలోనే ముంపు ఎందుకు సంభవించిందో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
అయితే ముంపు గ్రామాలలో అధికారపక్షం తరపున ముఖ్యమంత్రిగానీ, మరెవరన్నా ఉన్నత స్థాయి నాయకులు గానీ పర్యటించకపోవడం విమర్శకు దారి తీసింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన తరపున ఇక్కడ ఎవరన్నా ఉన్నత స్థాయి పర్యవేక్షణ చేస్తే విమర్శకు అవకాశం ఉండేది కాదు.
ఎన్నికలలో ఘన విజయం సాధించి వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సంభవించిన మొదటి విపత్తు విషయంలో అధికార యంత్రాంగం ఎలా స్పందించిందన్న విషయం కన్నా ప్రభుత్వాధినేతలు ఎలా స్పందించారన్న విషయం చర్చనీయాంశమైంది. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో అన్ని తానై వ్యవహరించి మీడియాలో ప్రస్పుటంగా కనబడటం చంద్రబాబు నాయుడి స్టైల్. ఆయన ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అమెరికా పర్యటన నుండి తిరిగి రాగానే గుంటూరులోని టిడిపి కార్యాలయంలో పరిస్థితులను సమీక్షించారు. ముంపు గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు పార్టీ బృందాలను పంపుతున్నారు.