అమెరికా: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ.. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. టెక్సాస్లోని హోస్టన్లో మోదీ పర్యటించనుండగా శుక్రవారం అక్కడ వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. హోస్టన్లో ఈ నెల 22న ‘హౌడీ-మోడీ’ పేరుతో చరిత్రాత్మక సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ తోపాటు 50 వేల మంది ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలూ రాబోతున్నారు. అంత పెద్ద సదస్సు జరుగుతుండగా… ఈ వరదలు రావడం సమస్యగా మారింది. భారీ వర్షాలతో నీట మునిగిన టెక్సాస్ నగరంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చి వెళ్లేందుకు బోట్లను ఉపయోగిస్తున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్ గవర్నర్ రాష్ట్రంలోని 13 కౌంటీల్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే, వాతావరణంలో మార్పు వస్తుందని, హరికేన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గవర్నర్ తెలిపారు.
మరోవైపు ఆదివారం హౌడీ మోడీ సభకు దాదాపు 50వేల మంది ఇండో-అమెరికన్లు హాజరుకానున్నారు. హోస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో హౌడీ మోడీ పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు ఇరు దేశాలకు పరస్పరం ఎలా ఉపయోగపడుపతున్నాయనే విషయాలను కూడా ఈ సభలో మోదీ వెల్లడించనున్నారు. మరోవైపు భారత్ అభివృద్ధిలో ప్రవాసీయుల పాత్రపై కూడా ప్రధాని మాట్లాడనున్నారు. రెండోసారి భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రధాని మోదీ ప్రవాసీయులతో పంచుకోనున్నారు. ప్రధాని మోదీ సభకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరుకానుండటంపై ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్, మోదీ ఇరువురు చివరిసారిగా గత నెల ఆగస్టులో జీ7 సదస్సులో భేటీ అయ్యారు.
రేపటి నుంచి ఈ నెల 27 వరకూ ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధానంగా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్, న్యూయార్క్ లో ఆయన పర్యటనలు సాగనున్నాయి. రేపు ఢిల్లీ నుంచీ బయలుదేరే మోదీ… ముందుగా హోస్టన్ వెళ్తారు. అక్కడి రౌండ్ టేబుల్ మీటింగ్లో పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అవుతారు. అనంతరం ఈ నెల 22న ఐక్యరాజ్యసమితి సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆరోగ్యం, టెర్రరిజంపైనా మోదీ మాట్లాడతారు. తర్వాత ఎన్ఆర్జీ స్టేడియంలో ఎన్నారైలతో మోదీ చరిత్రాత్మక మీటింగ్ ఉంటుంది. అమెరికా టైమ్ ప్రకారం 22న ఉదయం 10 గంటలకు అది జరగనుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు 1500 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు.