హైదరాబాద్: హుజూర్ నగర్ నియోజకవర్గానికి వంద కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి… రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా అని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మె, బకాయిల చెల్లింపు తదితర అంశాలపై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. బకాయిల వివరాలను ఈ నెల 31లోపు నివేధించాలని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీని హైకోర్టు ఆదేశించింది. కార్మికులను సమ్మె విరమించాలని ఆదేశించలేమని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. శుక్రవారం(నవంబర్ 1) జరగబోయే విచారణకు ఆర్టీసీ ఫైనాన్స్ సెక్రటరీ, ఎండీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు సూచించింది. జీహెచ్ఎంసీ రూ.335 కోట్లు చెల్లించిందా ? లేదా? అనే విషయాన్ని తెలపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.4,253 కోట్లలో రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయా ? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు పరిశీలించకుండానే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తమకు నివేదిక సమర్పించారని హైకోర్టు ఆక్షేపించింది.
అంతకుముందు కోర్టులో సమ్మెపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 1099 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ వాదించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు… కార్మికుల నాలుగు ప్రధాన డిమాండ్లు తీర్చేందుకు అవసరమైన రూ. 47 కోట్లు ఇస్తారా ? ఇవ్వరా ? సూటిగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. అయితే దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి చురకలు వేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ కురిపించిన వరాలను పరోక్షంగా ప్రస్తావించిన హైకోర్టు…’ఒక్క నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం… రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా ?, కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా?, మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎంత? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
బస్సులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అయితే, ఇప్పటికీ మూడో వంతు బస్సులు కూడా తిరగడం లేదని హైకోర్టు మండిపడింది. బస్సులు లేక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేనప్పుడు సెలవులను ఎందుకు పొడిగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగునపెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల్లో ఏపీ 58, తెలంగాణ 42 శాతం చెల్లించాల్సి ఉంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదన్నారు. ఆస్తులు పంపకం ఎందుకు జరగలేదని కోర్టు ప్రశ్నించగా… అది కేంద్రం పరిధిలోని అంశమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.