హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్లో ఆగి ఉన్న హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంతో ఎంఎంటిఎస్లోని ప్రయాణీకులు భయభ్రాంతులకు గురి అయ్యారు. సమాచారం తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఉస్మానియా, కాచిగూడ ఆస్పత్రులకు తరలించారు. క్యాబిన్లో చిక్కుకున్న ఎంఎంటిఎస్ రైలు లోకో పైలెట్ శేఖర్ ను వెలికి తీసేందుకు రైల్వే, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రాణపాయం కలగకుండా ఆక్సిజన్, సెలైన్ అందించి గ్యాస్ కట్టర్ తో క్యాబిన్ కత్తిరించి శేఖర్ ను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.