న్యూఢిల్లీ: అడ్డగోలుగా ఫీజులు పెంచారంటూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు) విద్యార్ధులు సోమవారం పెద్దఎత్తున నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను రంగంలోకి దించినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. పోలీసులు లాఠీలతో, వాటర్ కేనన్తో విద్యార్ధులపైకి విరుచుకుపడ్డారు.
జెఎన్యు స్నాతకోత్సవం రోజున విద్యార్ధుల నిరసన చోటు చేసుకుంది. వసంత్కుంజ్లోని అఖిలభారత సాంకేతిక విద్యామండలి ప్రాంగణంలో జరిగిన ఆ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యార్ధులు అక్కడకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బారికేడ్లు అడ్డు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు వాటర్ కేనన్లు ప్రయోగించారు.
ఫీజులు 300 శాతం పెంచారనీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్ధులు భరించలేరనీ విద్యార్ధి సంఘం పేర్కొంటున్నది. పెంపుదల అంత ఎక్కువేం కాదని యూనివర్సిటీ యాజమాన్యం అంటున్నది. వెంకయ్య నాయుడితో పాటు స్నాతకోత్సవానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ విద్యార్ధి సంఘం నాయకుడు అయిషి ఘోష్తో సమావేశమయ్యారు. వివాదాన్ని ఈ నెల 15 వ తేదిన జరిగ్ సమావేశంలో పరిష్కరిస్తామని ఆ శాఖ తెలిపింది. తమపై డ్రెస్ కోడ్ కూడా రుద్దుతున్నారని విద్యార్దులు అంటున్నారు.