భారతీయ ఎశాట్ పరీక్ష ఫలితం ఇది
దారుణాతి దారుణమన్న నాసా
వాషింగ్టన్: భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వల్ల అంతరిక్షంలో 400 ముక్కల చెత్త ఏర్పడిందని నాసా తెలిపింది. దీనివల్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు కొత్త ప్రమాదం ఏర్పడుతుందంది. నాసా అధిపతి జిమ్ బ్రిడెన్ స్టైన్ ఈ విషయమై మాట్లాడారు. ప్రపంచంలో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి సామర్ధ్యం ఉన్న నాలుగో దేశంగా ఈ పరీక్షతో భారత్ నిలిచింది. వాటిలో అన్ని ముక్కలూ ట్రాక్ చేయగలంత పెద్దవి కావని, 10 సెంటీమీటర్లు లేద అంతకంటే పెద్దవి సుమారు 60 ముక్కలుంటాయని బ్రిడెన్ స్టైన్ అన్నారు. అయితే.. కూలిన భారత ఉపగ్రహం భూకక్ష్యకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఐఎస్ఎస్, ఇతర ఉపగ్రహాలకు చాలా కింద ఉన్నట్లు లెక్క. అయినా, 24 మక్కలు మాత్రం ఐఎస్ఎస్ కిందిభాగం కంటే పైకి వెళ్తున్నట్లు బ్రిడెన్ స్టైన్ చెప్పారు.
ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపడం కష్టం అవుతుందన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో తమపై కలిగే ప్రభావంపై నాసా చాలా స్ఫష్టంగా ఉందని చెప్పారు. ఐఎస్ఎస్, ఉపగ్రహాలను ఏవైనా ముక్కలు ఢీకొనే అవకాశం ఉందా అన్న విషయాన్ని అమెరికా సైన్యం గమనిస్తుంది. ప్రస్తుతం 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణం ఉన్న 23వేల వస్తువులను వాళ్లు పరిశీలిస్తున్నారు.
ఇంతకుముందు చైనా ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంస క్షిపణి వల్ల దాదాపు 3 వేల ముక్కలు తయారయ్యాయి. అది భూ కక్ష్య నుంచి 852 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారతీయ ప్రయోగం వల్ల పది రోజుల్లో ఐఎస్ఎస్ ను ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందని బ్రిడెన్ స్టైన్ చెప్పారు. అయితే, ఈ ముక్కలలో చాలావరకు వాతావరణంలోకి ప్రవేశించేటపుడు మండిపోతాయి కాబట్టి ముప్పు క్రమంగా తగ్గుతుంది.