(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: వివాదాస్పద స్వామి నిత్యానందపై మొత్తం మీద ఇంటర్పోల్ నోటీసులు జారీ అయ్యాయి. ఇండియాలో మానభంగం, లైంగిక అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై నోటీసు జారీ చేయాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వం కొన్ని వారాల కిందట ఇంటర్పోల్ను కోరింది. ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ బుధవారం తెలిపింది. ఈ నోటీసు జారీ అయిన తర్వాత నిందితుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశ ప్రభుత్వం ఆ సమాచారాన్ని తప్పనిసరిగా ఇంటర్పోల్తో పంచుకోవాలి.
నిత్యానందపై కర్నాటకలో, గుజరాత్లో పలు కేసులు ఉన్నాయి. బాలికలను కిడ్నాప్ చేసి తన ఆశ్రమంలో బంధించి ఉంచాడన్న అభియోగంపై గుజరాత్లో తాజా కేసు నమోదయింది. నిత్యానంద దేశం వదిలి పారిపోయిన అనంతరం అతను ఈక్వెడార్ తీరంలోని ఒక దీవిలో కైలాస్ అనే స్వతంత్ర దేశాన్ని స్థాపించినట్లు చెబుతూ వార్తలు, వీడియోలు బయటకు వచ్చాయి. వెంటనే ఈక్వెడార్ ఈ వార్తలను ఖండించింది. తాము నిత్యానందకు ఎక్కడా భూమి ఇవ్వలేదనీ, ఆశ్రయం ఇవ్వాలన్న అతని విజ్ఞప్తిని తిరస్కరించామనీ ఈక్వెడార్ స్పష్టం చేసింది.