అమరావతి: రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన పోరుబాటకు సిద్ధమవుతోంది. ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా నవంబర్ మూడవ తేదీన విశాఖలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తోంది. ఈ నెల 30న కార్మికుల చేతుల మీదుగా లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో ఆవిష్కరించనున్నారు.
చలో విశాఖపట్నం కార్యక్రమ నిర్వహణకు సంబందించి సోమవారం హైదరాబాదు పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ నిర్ణయాలతో నెలకొన్న ఇసుక సంక్షోభం మూలంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని ప్రతి జిల్లా కేంద్రాలలో ఎలుగెత్తి చాటాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీన జనసేన నేతలు జిల్లా కలెక్టర్లకు సమస్యలపై వినతి పత్రం అందించేందుకు, పార్టీ శ్రేణులు, కార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోప్రదర్శనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
నకిలీ ఖాతాలను నమ్మొద్దు
చలో విశాఖపట్నం కార్యక్రమం నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించారనీ, వాటి ద్వారా విరాళాలు సేకరిస్తున్న విషయం పార్టీ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి ఖాతాలను ఎవరు నమ్మవద్దని పార్టీ అధినేత రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.