హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 24 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. చర్చల వివరాలతో ఆర్టీసీ యాజమాన్యం అదనపు కౌంటర్ దాఖలు చేసింది. కార్మికులతో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదించింది. అన్ని డిమాండ్లు చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని యాజమాన్యం కౌంటర్ లో పేర్కొంది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 21 డిమాండ్లపై చర్చిద్దామని కోరామని, కానీ ఆర్టీసీ సంఘాల నేతలు విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని పట్టుబట్టారని తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ.. కార్పోరేషన్ పై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చలు సాగాలని హైకోర్టు పేర్కొంది. మొదట యూనియన్ పేర్కొన్న 21 డిమాండ్లపై చర్చలు సాగితే.. కార్మికుల్లో ఆత్మస్ఘైర్యం కలుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ కార్మికుల కంటే ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఓవర్ నైట్లో ఆర్టీసీ విలీనం ఎలా జరుగుతుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఆర్ధికభారం పేరుతో ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకనే..ఆర్టీసీ ఇంత నష్టాల్లో ఉందని, కార్పొరేషన్కు పూర్తిస్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎండీ ఉంటే కార్మికులు తమ సమస్యలు చెప్పుకునే వారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ.46.2 కోట్లు అవసరమని నివేదికల్లో పేర్కొన్నారని, ప్రభుత్వం ఎన్నో ఖర్చలు చేస్తోంది.. రూ.47 కోట్లు ఇవ్వలేదా? అని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే, ప్రభుత్వాన్ని అడిగి రేపు చెబుతామని ఏజీ సమాధానమిచ్చారు. దీంతో ‘మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి.. సీఎస్, ఆర్థికశాఖ కార్యదర్శిని పిలుస్తాం’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అయితే బుధవారం నాటికి వాయిదా వేయాలని ప్రభుత్వం కోరంగా న్యాయస్థానం కుదరదని తేల్చి చెప్పింది.
అంతకుముందు, ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి తన వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను ఆర్టీసీ యాజమాన్యం తప్పుగా అన్వయించుకుందని తెలిపారు. 21 డిమాండ్లపైనే చర్చిస్తామంటూ మిగతా డిమాండ్లను యాజమాన్యం విస్మరిస్తోందని ఆరోపించారు. తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరిస్తుందా ? లేదా ? అన్నది తర్వాత విషయమని.. చర్చిస్తే తప్పేంటని వాదించారు.