బెంగళూరు: కర్నాటక రాజకీయ పరిణామాలు రసకందాయంగా మారాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునే వ్యూహంలో భాగంగా సోమవారం కాంగ్రెస్కు చెందిన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రి పదవుల ఆశతో బుజ్జగించేందుకు వీలుగా డిప్యూటి సిఎం పరమేశ్వరతో పాటు హోంమంత్రి ఎంబి పాటిల్, రెవెన్యూ మంత్రి ఆర్వీ దేవ్ పాండే, మంత్రులు డికె శివకుమార్, ఖాదర్, జార్జ్, జమీర్ అహ్మద్ ఖాన్తో సహా 22మంది కాంగ్రెస్ మంత్రులు నేడు రాజీనామా చేశారు.
జెడిఎస్, కాంగ్రెస్ కూటమికి చెందిన 11మంది అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి ముంబయి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వీరంతా ముంబాయిలోని ఒక హోటల్ ఉన్నారు.
పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్న తరుణంలోనే మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థి నగేష్, మరో నేత రహీమ్ ఖాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో కర్నాటక రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినప్పటికీ తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీలేదని కాంగ్రెస్ నేత శివకుమార్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పర్యటన నుండి నిన్న సాయంత్రం బెంగళూరు చేరుకున్న ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
డిప్యూటి సిఎం పరమేశ్వరతో పాటు ముఖ్యనేతలతో కుమారస్వామి భేటీ అయి మంతనాలు జరిపారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుత మంత్రులతో రాజీనామాలు చేయడమే శరణ్యమని అంగీకారానికి వచ్చారు. దీనిపై కర్నాటక పిసిసి ఇన్చార్జి కెసి వేణుగోపాల్తోనూ కుమారస్వామి చర్చించారు. జెడిఎస్ మంత్రుల రాజీనామా చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మంత్రుల రాజీనామా లేఖలను కుమారస్వామి గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేయనున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కుమారస్వామి అంగీకరించారు.
కాగా తమ రాజీనామాలను వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని 13మంది రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మరి కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ముంబాయికి వస్తున్నట్లు రెబెల్ ఎమ్మెల్యే సోమశేఖర్ తెలిపారు.
ఈ పరిమాణాలకు బిజెపియే కారణమని సీనియర్ నేత దేవగౌడ్, కుమారస్వామిలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బిజెపి ఖండిస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్ రాజీనామా చేసి బిజెపికి మద్దతు ప్రకటిచడంపై ఆ పార్టీ నాయకురాలు శోభ కరంద్లాజే స్పందించారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని శోభ తెలిపారు. అసమ్మతి నేతలతో బిజిపి నేతలు ఎవ్వరూ సంప్రదింపులు జరపడం లేదని శోభ స్పష్టం చేశారు. మెజారిటీ కోల్పోయినందున కుమార స్వామి వెంటనే రాజీనామా చేయాలని శోభ డిమాండ్ చేశారు.
ఈ పరిణామాల క్రమంలో తమ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు బిజెపి నేతలు ఈ సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.