బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఆ మేరకు కర్నాటక గవర్నర్ విజూభాయ్ వాలా గురువారం రాత్రి ముఖ్యమంత్రిని ఆదేశించారు.
అంతకు ముందు విశ్వాసపరీక్ష తీర్మానంపై ఈరోజే వోటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్కు గవర్నర్ లేఖ రాశారు. స్పీకర్ ఆ లేఖను సభలో చదివి వినిపించారు. కాంగ్రెస్- జెడిఎస్ సంకీర్ణం కావాలనే జాప్యం చేస్తోందంటూ బిజెపి ఫిర్యాదు చేసిన వెంటనే గవర్నర్ విజూభాయ్ వాలా ఈ లేఖ రాశారు. స్పీకర్ గవర్నర్ లేఖను పట్టించుకోకుండా సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
అనంతరం ముఖ్యమంత్రికి గవర్నర్ నుంచి లేఖ వచ్చింది. సభలో విశ్వాసపరీక్ష జరుగుతుంది కదా అని తాను ఇంతవరకూ జోక్యం చేసుకోలేదనీ, ఇప్పుడు తప్పడం లేదనీ గవర్నర్ పేర్కొన్నారు. “15 మంది శాసనసభ్యులు నన్ను కలిశారు. రాజీనామాలు ఇచ్చారు. మరో ఇద్దరు మద్దతు ఉపసంహరించారు. ఈ కారణాలు, ఇతర పరిస్థితుల దృష్ట్యా మీరు సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు ప్రాధమికంగా కనబడుతున్నది” అని గవర్నర్ ముఖ్యమంత్రికి రాశారు.