ఇటీవలి ఎన్నికలలో తండ్రి కోడెల శివప్రసాద్ రావు తరపున ప్రచారం చేస్తున్న కుమార్తె విజయలక్ష్మి
అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబసభ్యులకు కష్టాలు తప్పేట్లు లేవు. భూమి కబ్జా పెట్టి తర్వాత దానిని వదిలినందుకు డబ్బు తీసుకున్నారన్న అభియోగంపై కోడెల కుమార్తె విజయలక్ష్మిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
కోడెల శివప్రసాద్ గత అసెంబ్లీలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత అయిదేళ్లుగా ఆయన కుమారుడు శివరాం, కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మి ఎవరినిబడితే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తూ వచ్చాయి. కుటుంబంపై ఉన్న ఆరోపణల దృష్ట్యా కోడెలకు మళ్లీ సత్తెనపల్లి టికెట్ ఇవ్వరని కూడా ఎన్నికల ముందు అనుకున్నారు.
చివరికి కోడెలకే సత్తెనపల్లి టికెట్ కేటాయించడం, ఆయన ఓడిపోవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు గతంలో భయంతో బయటకురాలేకపోయామంటూ కొందరు కోడెల కుటుంబసభ్యులపై తాజాగా అబియోగాలు చేస్తున్నారు.
కెట్యాక్స్ పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్న కోడెల కుటుంబసభ్యులెవరూ చట్టం నుండి తప్పించుకోలేరని వైసిపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులేనని ఆయన పేర్కొన్నారు. నిర్బంధ వసూళ్ల మాఫియాపై దర్యాప్తు చేస్తామనీ, బాధితులు నిర్భయంగా బయటకురావాలనీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు ఆయనను ప్రేరేపించిన విషయం పద్మావతి అనే మహిళ కోడెల కుమార్తె విజయలక్ష్మిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు. కేసానుపల్లి వద్ద తనకున్న ఎకరం పొలాన్ని కబ్జా పెట్టేందుకు విజయలక్ష్మి ప్రయత్నించారనీ, 15 లక్షల రూపాయలు వసూలు చేసి వదిలిపెట్టారనీ ఆమె తెలిపారు. తాజగా మరో అయిదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె పేర్కొన్నారు.
శుక్రవారం కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంపై కూడా ఒక కేసు నమోదయింది. రావిపాడు దగ్గర అపార్ట్మెంట్ నిర్మాణానికి 14 లక్షలు రూపాయలు ముట్టజెప్పానంటున్న ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు శివరాంపై కేసు నమోదు చేశారు. మరో మూడు లక్షల రూపాయల కోసం వేధిస్తున్న కారణంగా పోలీసులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపారు.