అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి కొన్ని కట్టడాలకు నోటీసులు ఇచ్చింది.
అయితే ఈ లోపు ఆ కట్టడాల యజమానులు రకరకాల కథనాలతో ముందుకు వస్తున్నారు. కరకట్టకు ఆనుకొని శైవక్షేత్రం కూడా ఉంది. ఈ సందర్భంలో శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తన క్షేత్రానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. నదీ పరివాహాక ప్రాంతంలో ఆధ్యాత్మిక క్షేత్రం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమనీ, ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారని శివస్వామి పేర్కొంటున్నారు. ఇలాంటి అధ్యాత్మిక క్షేత్రాన్ని కూల్చివేస్తే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగదని ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కడైనా శైవక్షేత్రాలు నదీతీరాన్నే ఉంటాయనే విషయాన్ని శివస్వామి గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ క్షేత్రానికి మినహయింపు ఇవ్వాలనీ, లేకుంటే తాము కోర్టుకు వెళతామని శివస్వామి స్పష్టం చేశారు.
కరకట్టపై ఉన్న తమ అతిధి గృహానికి సిఆర్డిఎ అధికారులు నోటీసు ఇచ్చారని బిజెపి మాజీ ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. 25 ఏళ్ల క్రితమే తాను ఉండవల్లిలో అక్కడ 25 ఎకరాల భూమి తీసుకున్నాననీ, వుడా, ఇరిగేషన్ శాఖల నుండి అనుమతులు ఉన్నాయనీ గంగరాజు చెప్పారు. బిఆర్ఎస్ వచ్చిన తర్వాత క్రమబద్దీకరణ కోసం ధరఖాస్తు చేశామని గంగరాజు తెలిపారు. కానీ ప్రభుత్వం బిఆర్ఎస్ కింద అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు వదిలి కట్టడం నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారని గంగరాజు చెప్పారు. నదిలో కూడా తమకు స్థలం ఉందనీ, వరద వచ్చినప్పుడల్లా తమ స్థలమే కొంత కోల్పోయామని గంగరాజు చెప్పారు. తాము నిర్మాణాలు చేపట్టిన తరువాతనే వంద మీటర్ల లోపల కట్టకూడదని జివో వచ్చిందని గంగరాజు అన్నారు. తాము నిబంధనలు అతిక్రమించి కరకట్టను ఆక్రమించుకోలేదనీ, కృష్ణానదే తమ భూమిని ఆక్రమించుకుందని గంగరాజు చెప్పారు. తాను చట్టప్రకారమే నడుచుకుంటున్నట్లు గంగరాజు తెలిపారు. ప్రజావేదిక మాదిరిగా కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంట ఉన్న ఎన్నో కట్టడాలను కూల్చాల్సి ఉంటుందని గంగరాజు అన్నారు. తాను నిర్మించింది విలాసవంతమైనది కాదనీ, కేవలం ఫాం హౌస్ మాత్రమేనని ఆయన అన్నారు. చిన్న చిన్న పొరబాట్లు అందరూ చేస్తారనీ అందరి మీదా చర్యలు తీసుకుంటే మాపై చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని గంగరాజు అన్నారు. సిఆర్డిఎ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని గంగరాజు తెలిపారు.
రాష్ట్ర విభజనకు పూర్వం సిఆర్డిఎ ఏర్పడక ముందు గ్రామ పంచాయతీ, హుడా నుండి అనుమతులు తీసుకొని నిర్మించిన కట్టడాలే వీటిలో ఎక్కువ. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదీ తీరం వెంట ఉన్న కట్టడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరం వెంట ఉన్న నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ తరువాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కరకట్టపై నివాసం ఏర్పాటు చేసుకోవడంతో మంత్రి ఉమా ఆ ఊసెత్తడం మానేశారు.
దశాబ్దాల క్రితం నిర్మాణాలు జరిగి కొనసాగుతున్న తరుణంలో వీటిని ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రభుత్వ నోటీసులపై పలువురు హైకోర్టు ఆశ్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా, కొందరైతే తమ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయంటూ గేట్ ముందు బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు.