న్యూఢిల్లీ: అనిల్ అంబానీని నిజాయితీ లేని వ్యాపారవేత్తగా అభివర్ణించినందుకు రాహుల్ గాంధీపై రిలయన్స్ గ్రూపు ఘాటుగా స్పందించింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో తమ గ్రూపునకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చాయని గుర్తుచేసింది. రాహుల్ గాంధీ తన ప్రచారంలో తరచు తమ గ్రూపు చైర్మన్ అనిల్ డి అంబానీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని రిలయన్స్ గ్రూపు ఒక ప్రకటనలో మండిపడింది. ఆయన ప్రచారమంతా తప్పుడు సమాచారం, దురుద్దేశంతో కూడిన అబద్ధాలు, అపవాదులు, వక్రీకరణలతోనే నిండి ఉందని విమర్శించింది. అనిల్ అంబానీపై ఆయన చేస్తున్న విమర్శలన్నీ పూర్తిగా అసత్యాలని ఆ ప్రకటనలో తెలిపింది.
‘‘ఇప్పటివరకు రాహుల్ గాంధీ బహిరంగ సభలలో చేసిన ప్రసంగాలన్నీ చూస్తే, ఆయన తన ఆరోపణలలో ఒక్కదానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదు. తాను చేస్తున్న నిందాపూర్వకమైన, పరువునష్టం కలిగించే ప్రచారానికి నిర్దిష్టమైన సాక్ష్యాలేవీ ఆయన ఇంతవరకు అందించలేదు’’ అని ఆ గ్రూపు ప్రకటన చెప్పింది. ప్రధాని నరేంద్రమోదీ రైతులు, పేదలను పట్టించుకోకుండా అనిల్ అంబానీ కంపెనీకి భారీ ఎత్తున మేలు చేసేలా రఫేల్ ఆఫ్ సెట్ కాంట్రాక్టు ఇప్పించారని రాహుల్ గాంధీ తరచు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయనను బహిరంగ చర్చకు సవాలు చేసినపుడు కూడా ‘అనిల్ అంబానీ ఇల్లు తప్ప’ ఎక్కడైనా చర్చకు రెడీ అని చెప్పారు.
‘‘2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు రూ. లక్ష కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. విద్యుత్, టెలికాం, రోడ్లు, మెట్రో తదితర ప్రాజెక్టులు ఇచ్చింది రాహుల్ గాంధీ సొంత పార్టీ కాంగ్రెసే’’ అని కూడా రిలయన్స్ తన ప్రకటనలో గుర్తుచేసింది. అంటే ఆయన ప్రభుత్వం కూడా నిజాయితీలేని వ్యాపారవేత్తకు పదేళ్ల పాటు మద్దతు ఇస్తూనే ఉందా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పట్టించుకోకూడదనే రిలయన్స్ గ్రూపు భావించిందని, కానీ ఆయన మాత్రం తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నికల ప్రచారంలో ఆయన చెబుతున్న అవాస్తవాలకు గాను ఇప్పటికే రాహుల్ సుప్రీంకోర్టులో పరువునష్టం దావా ఎదుర్కొంటున్నారని తెలిపింది.