న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మారిన పరిస్థితుల్లో శివసేనను బలపరచడం కోసం కాంగ్రెస్ ముందుకు వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునేందుకు సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశం అవుతున్నది.
శివసేనను కాంగ్రెస్ బలపరచడం అంటే సిద్ధాంతపరంగా పెద్ద మార్పుకు అంగీకరించడమే. శివసేన హిందూత్వ రాజకీయాలు, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో మహారాష్ట్రలో ఎదిగింది. హిందుత్వ రాజకీయాలకు పూర్తి విరుద్ధం అయిన కాంగ్రెస్ ఇప్పుడు శివసేనను బలపరచాలని నిర్ణయించుకుంటే ఉమ్మడి కార్యక్రమాలు, విధానాలకోసం పట్టుపట్టే అవకాశం ఉంది.
శివసేనతో పొత్తు పెట్టుకునే విషయం ప్రాధమికంగా చర్చించాలన్నా గానీ ముందు శివసేన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఎన్సిపి నేత శరద్ పవార్ షరతు విధించారు. దానికోసం శివసేన మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేయడంతో ఆ రెండు పార్టీల మధ్య చర్చలకు మార్గం సుగమం అయింది. పవార్ ప్రోద్బలం వల్లనే కాంగ్రెస్ కూడా శివసేనతో సంబంధాల విషయం ఆలోచించేందుకు అంగీకరించినట్లు కనబడుతోంది. ఎలాంటి నిర్ణయమైనా కాంగ్రెస్తో కలిసే తీసుకుంటామని పవార్ అంటున్నారు.
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసి ప్రభుత్వం ఏర్పాటులో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలిసిందిగా కోరే అవకాశం ఉంది. అన్ని మార్గాలూ పరిశీలిస్తున్నామనీ, ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదనీ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు.