ముంబై: రత్నగిరి జిల్లాలో తవారే ఆనకట్టకు గండి కొట్టింది పీతలట. అవును, మీరు సరిగానే విన్నారు. పీతల కారణంగా డ్యాంకు గండి పడిందని మహారాష్ట్ర జల సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ గురువారం అన్నారు. భారీగా కురిసిన వర్షాలకు మంగళవారం రాత్రి తవారే డ్యాంకు గండిపడి వరద ఉధృతిలో దిగువన 14 మంది మృతి చెందారు. గల్లంతయిన పలువురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
ముందు ఆనకట్టకు లీకేజీలు లేవనీ, తర్వాత పెద్ద సంఖ్యలో పీతలు చేరిన విషయం స్థానికులు తెలిపారనీ, వాటి కారణంగానే లీకేజీ ఏర్పడిందనీ సావంత్ అన్నారు. నాసిరకం నిర్మాణం కారణంగా ప్రమాదం జరిగిందా అని ప్రశ్నించినపుడు, నిర్మాణం నాసిరకంగా ఉందని స్థానికులు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ముఖ్యమంత్ర దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం వెలిబుచ్చారు. కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ విచారణకు ఆయన ఆదేశించారు.