కోలకతా: “డబ్బు, పోలీసులు, ఇవిఎంలు వీటి ద్వారానే మొన్నటి ఎన్నికలలో బిజెపి విజయం సాధించింది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికలలో వారు మొత్తం కోల్పోతారు”. ఈ మాటలన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆదివారం కోలకతా నగరంలో ఆమె తృణమూల్ కాంగ్రెస్ మెగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. తనపై బిజెపి ఎక్కుపెడుతున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చేందుకు ప్రయత్నించారు. ప్రతి ఏటా తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించే అమరుల దినం సందర్భంగా ఈ ర్యాలీ జరిగింది. 1993లో మార్క్సిస్టుల ఏలుబడిలోని బెంగాల్లో మమతా బెనర్జీ ర్యాలీ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించినవారి సంస్మరణార్ధం ప్రతి ఏటా అమరుల దినం జరుపుతున్నారు.
గత లోక్సభ ఎన్నికలు హిస్టరీ కాదు మిస్టరీ అని మమత వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన కమిషన్ డబ్బులు వెన్కకి ఇవ్వకుండా ర్యాలీకి వస్తే తృణమూల్ నాయకులను బస్సుల్లోంచి దించి కొట్టాలన్న బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “మేమూ అదే పద్ధతి అనుసరిస్తే మీరు తట్టుకోగలరా” అని ఆమె ప్రశ్నించారు.
“బిజెపి పోరాటం ఏమిటి? ఎవరు వారు? బెంగాల్లో వారు ఎవరికీ తెలియదు. ఆరెస్సెస్ గూండాలే స్కూళ్ల ద్వారా ఈ మురికి పనులు చేస్తున్నారు. బీహార్లో ఆరెస్సెస్ కార్యకలాపాలను కనిపెట్టిఉండాల్సిందిగా ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. మనం ఇంకా పోలీసులకు ఆ మాట చెప్పలేదు” వారు ఆ విషయం గ్రహిస్తే మంచిది అని మమత పేర్కొన్నారు.
తృణమూల్ నాయకులు కట్ మనీ (కమిషన్లు) తిరిగి ఇవ్వాలన్న బిజెపి డిమాండ్ను ప్రస్తావిస్తూ, “మమ్మల్ని అడుగుతున్నారా. మీరు వాగ్దానం చేసిన 15 లక్షల నల్లధనం ఏది” అని ఆమె ప్రశ్నించారు. బిజెపి వారు అందరికన్నా పెద్ద బందిపోట్లు అని మమత ఆరోపించారు.