శ్రీశైలం: కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది మళ్లీ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్కు ఎగువ ప్రాజెక్టుల నుండి వరద కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతో పాటు ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యాలతో నిండుకుండలా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదు సార్లు శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు తాజాగా ఆదివారం మరో మారు గేట్లను తెరిచి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. డ్యామ్ నీటి మట్టం 215.81 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి మట్టం 215.77 టిఎంసిలుగా ఉంది. ఇన్ఫ్లో 1,51,458 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 95,759 క్యూసెక్కులుగా ఉంది. ఈ ఏడాది జూలై 30వ తేదీన జలాశయానికి నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఆగస్టు తొమ్మిది నాటికి డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్లను తెరిచి సాగర్కు నీటిని విడుదల చేశారు. తిరిగి రెండవ సారి సెప్టెంబర్ తొమ్మిదిన తరువాత వరుసగా 19,26, అక్టోబర్ తొమ్మిదిన క్రస్ట్ గేట్లను తెరిచి దిగువ సాగర్కు నీటిని విడుదల చేశారు.
నాగార్జునసాగర్కి ఇన్ఫ్లో 1,21,706 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,12,474 క్యూసెక్కులు, పులిచింతలకు ఇన్ఫ్లో 1,16,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,19,349 క్యూసెక్కులు నమోదు అయ్యింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 1,17.424 క్యూసెక్కులు కాగా 51,500 క్యూసెక్కుల వరద నీరు దిగువన సముద్రంలోకి వదులుతున్నారు.