2017 బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆనాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే మనకు నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే దశాబ్దాల కాంగ్రెస్ పాలన అవినీతినీ, నల్లధనాన్నీ వ్యవస్థీకృతం చేసిందనీ, ఈ రుగ్మతలను రూపు మాపడమే తన లక్ష్యమనీ ఆయన చెప్పుకుంటున్నారు. చాలామంది ప్రజలను ఆయన నమ్మించగలిగారు కూడా. ఆ పోరాటం సంగతేమో గానీ రాజకీయ పార్టీలు అధికారికంగా చేసే నిధుల సేకరణలో కూడా నల్లధనానికి దారులు వేసింది మోదీ ప్రభుత్వమే.
2017లో మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పధకం ప్రవేశపెట్టింది. దీని కింద ఎవరైనా గానీ బ్యాంకులకు వెళ్లి బాడ్లు కొనుగోలు చేసి తమ ఇష్టం వచ్చిన రాజకీయపార్టీకి వాటిని విరాళంగా ఇవ్వవచ్చు. అలా ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంటాయి. ఈ పధకం ప్రవేశపెట్టడం వెనుక జరిగన కథ తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
2017లో అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 బడ్జెట్లో ఈ పధకం ప్రకటించడానికి నాలుగు రోజుల ముందు జనవరి 28న ఆ శాఖలోని ఒక అధికారి, దీనికి ముందు రిజర్వు బ్యాంక్ సమ్మతి తీసుకోలేదన్న సంగతి గుర్తించారు. ఆయన వెంటనే తన పై అధికారులకు ఆ విషయం తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టాలంటే రిజర్వు బ్యాంక్ చట్టానికి కూడా సవరణలు చేయాలంటూ ఆ అధికారి చట్టసవరణ ముసాయిదా కూడా రాసి పైకి పంపారు.
అదే రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు ఆర్ధిక శాఖ నుంచి రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రామ సుబ్రమణ్యం గాంధీకి అయిదు లైన్ల ఇమెయిల్ పంపారు. ప్రతిపాదిత సవరణపై త్వరగా అభిప్రాయం చెప్పాలని కోరారు. తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జనవరి 30 తేదీన ఆర్బిఐ అభిప్రాయం పంపింది. బాండ్ల ద్వారా నల్లడబ్బు, హావాలా డబ్బు రాజకీయపార్టీలకు అందుతుందనీ, ఇది చాలా చెడ్డ సంప్రదాయాన్ని నెలకొల్పుతుందనీ ఆర్బిఐ పేర్కొన్నది. పైగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నది ఎవరన్నది కూడా తెలియదని ఆర్బిఐ పేర్కొన్నది.
ఎలక్టోరల్ బాండ్ల ప్రతిపాదనకు అభ్యంతరం తెలుపుతూ రిజర్వు బ్యాంక్ ఆర్ధిక శాఖకు పంపిన లేఖ
అర్బిఐ ఇంత తీవ్రంగా అభ్యంతరపెట్టినా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. ఎలక్టోరల్ బాండ్ల పధకం ఆర్బిఐకి సరిగ్గా అర్ధమయినట్లు లేదంటూ అప్పటి రెవిన్యూ కార్యదర్శి హష్ముఖ్ అధియా ఆర్బిఐ అభ్యంతరాలను అదే రోజున కొట్టిపడేశారు. ఆర్ధిక కార్యదర్శి తపన్ రే వెంటనే తాను కూడా ఫైలుపై సంతకం పెట్టారు. ఆ వెంటనే ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సంతకం పెట్టారు. రెండు రోజుల తర్వాత జైట్లీ పార్లమెంట్కు ఈ ప్రతిపాదన సమర్పించారు. తర్వాతి నెల ప్రతిపాదన చట్టంగా మారింది. ఆ విధంగా ఎలక్టోరల్ బాండ్ల పధకం ఆఘమేఘాలపై చట్టంగా రూపుదాల్చింది.
ఈ పధకం రాజకీయపార్టీలకు, ముఖ్యంగా భాతీయ జనతా పార్టీకి నిధుల వరద పారించింది. ఇప్పటివరకూ బ్యాంకులు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. వీటిలో 90 శాతం పైగా బిజెపికి అందినట్లు తెలుస్తోంది. మొదటి విడత అమ్ముడైన 222 కోట్ల బాండ్లలో బిజెపికి 95 శాతం అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫాంస్ సంస్థ తెలిపింది. గతంలో కార్పొరేట్ కంపెనీలు తాము రాజకీయపార్టీలకు ఇచ్చిన విరాళాలను బహిరంగపరచాల్సివచ్చేది. ముందు మూడేళ్లలో తమ కంపెనీ ఆర్జించిన లాభం సగటులో 7.5 శాతం కన్నా ఎక్కువ నిధులు విరాళంగా ఇవ్వడానికి వీలయ్యేది కాదు. విదేశీ కంపెనీలయితే అసలు విరాళాలు ఇచ్చేందుకు లేదు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల ఇదంతా మారిపోయింది. కంపెనీలు, ఆ మాటకొస్తే సూటుకేసు కంపెనీలు, వ్యక్తులు, ట్రస్టులు, విదేశీ కంపెనీలు గప్చిప్గా ఎన్ని కావాలంటే అన్ని ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి తమ ఇష్టం వచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు.
ఎలక్టోరల్ బాండ్ల పధకాన్ని లోక్సభలో జైట్లీ ప్రతిపాదించినపుడు, ఈ సంస్కరణ రాజకీయపార్టీల నిధుల సేకరణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చి భవిష్యత్తులో నల్లధనం రాకుండా అరికడుతుంది అని ప్రకటించారు. కానీ జరిగిందేమిటో తెలుసా? ఎలక్టోరల్ బాండ్ల పధకాన్ని లోక్సభ ఆమోదించిన తర్వాత నాలుగు నెలలకు ఆర్ధికశాఖ కార్యదర్శి తపన్ రే దీని విధివిధానాలు రూపొందించారు. వీటి ప్రకారం బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను బ్యాంకులు రహస్యంగా ఉంచాలి. ఈ వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. తమకు బాండ్లు విరాళంగా ఇచ్చిన వారి వివరాలను రాజకీయ పార్టీలు రికార్డు చేయాల్సిన అవసరం లేదు. మోదీ ప్రభుత్వం మరో గమ్మత్తు కూడా చేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని బహిరంగంగా చెప్పిన దానికి భిన్నంగా ఆ వివరాలు ప్రభుత్వానికి మాత్రమే తెలిసేలా చేశారు. బ్యాంకుల దగ్గరున్న వివరాలను కావాలనుకుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తీసుకోవచ్చని తీర్మానించారు.
ఆర్టిఐ కార్యకర్త కమోడోర్ లోకేష్ బాత్రా (రిటైర్డ్), హఫింగ్టన్ పోస్ట్ విడివిడిగా సమాచారం హక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక పత్రాల ఆధారంగా ఈ కథనాన్ని హఫిగ్టన్ పోస్టు వెబ్సైట్ ప్రచురించింది. దానిని సంక్షిప్తంగా ఇక్కడ ఇచ్చాం.
Featured Illustration Courtesy: Business Standard