(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్ తెలంగాణలో 40 రోజులకు పైగా సాగిస్తున్న సమ్మె కొనసాగించాలా లేక విరమించాలా అన్న విషయంలో ఆర్టీసీ కార్మికసంఘాలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. బుధవారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలని సంఘాల నాయకులు నిర్ణయించారు. బుధవారం మాత్రం సమ్మె కొనసాగుతుంది.
మంగళవారం మూడు కార్మిక సంఘాలు విడివిగా సమావేశమై అంతర్గతంగా చర్చలు జరుపుకున్నాయి. సమ్మె విరమించాలని ఒక సంఘం, కొనసాగించాలని మరో సంఘం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఎటూ తేల్చుకోలేని జెఎసి బుధవారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ లోపు డిపోల వారీగా అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు.
ఇన్ని రోజులు సమ్మె జరిగినా ముఖ్యమంత్రి కెసిఆర్ దిగిరాకపోవడం, ఆదుకుంటుందనుకున్న హైకోర్టు తమకు కొన్ని పరిమితులు ఉన్నాయంటూ నిస్సహాయత వ్యక్తం చేయడం ఆర్టీసీ కార్మికులలో ఎంతోకొంత నిస్పృహకు దారి తీసింది. సమ్మె విరమించి విధులలో చేరతామన్నా గానీ ముఖ్యమంత్రి తమను ఆదరించరేమోనన్న భయాలు కూడా ఉన్నాయి.