బెన్నెట్ రెబెల్లో, అతని పెంపుడు కుమార్తె ఆరాధ్య పాటిల్
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై: ఒక సూట్కేసు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. బాగా దుర్వాసన వేస్తోంది. పోలీసులకు కబురు వెళ్లింది. వచ్చి చూశారు. లోపల ఒక చేయి, ఒక కాలు, పురుషాంగం ఉన్నాయి. పోలీసులు బిత్తరపోయారు. ముంబై నగరంలోని మహిం బీచ్లో డిసెంబర్ రెండవ తేదీన జరిగిందీ సంఘటన.
ముంబై క్రయింబ్రాంచ్ పోలీసులు ఈ కేసును వారం తిరగకుండా పరిష్కరించారు. శనివారం పోలీసులు 19 ఏళ్ల ఆరాధ్య పాటిల్నూ, 16 ఏళ్ల ఆమె బాయ్ప్రెండ్నూ హత్యానేరంపై అరెస్టు చేసారు. పోలీసుల దర్యాప్తులో విభ్రమ కలిగించే విషయాలు బయటపడ్డాయి. హతుడికి ఆరాధ్య పాటిల్ దత్తత కుమార్తె. తన బాయ్ఫ్రెండ్ సహాయంతో పెంపుడు తండ్రిని ఆమె మట్టు పెట్టింది.
సూట్కేసులో శరీర అవయవాలతో పాటు ఒక తెల్ల చొక్కా, ప్యాంటు, ఎర్ర రంగు పొట్టి చేతుల స్వెటర్ కూడా పోలీసులకు దొరికాయి. గడ్డివామిలో సూది కోసం వెదికినట్లు వారు ఆ ఆధారాలతోనే రంగంలోకి దిగారు. చొక్కా మీద ఆల్మో మెన్స్ వేర్ అనే లేబుల్ ఉంది. నగరంలో అలాంటి టైలరింగ్ షాప్ కోసం వెదుకులాట మొదలయింది. కుర్లాలో అలాంటి పేరుతో ఒక టైలరింగ్ షాప్ కనబడింది.
ఇక అక్కడ పరిశోధన మొదలయింది. దొరికిన అవయవాలను బట్టి హతుడి ఒడ్డూ పొడవూ అంచనా వేశారు. గత వంద రోజులుగా అక్కడకు వచ్చిన కష్టమర్లు కుట్టించుకున్న బట్టల ప్రకారం హతుడితో సుమారుగా సరిపోయిన వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒక మనిషి దొరికాడు. పోలీసులు ఆ అడ్రసుకు పరిగెత్తారు. ఎవరికోసమైతే వెళ్లారో అతనే తలుపు తీశాడు. పోలీసులు నిరాశతో వెనుదిరిగారు. మళ్లీ టైలరింగ్ షాప్లో అన్వేషణ మొదలయింది. మరో అనుమానించదగ్గ బిల్లు కనబడింది. అందులో బెన్నెట్ అని పేరు తప్ప మరేమీ రాసిలేదు.
ఈ సారి పోలీసులు సోషల్ మీడియాలో వెతుకులాట మొదలుపెట్టారు. ఫేస్బుక్లో బెన్నెట్ రెబెల్లో అనె ప్రొఫైల్ కనబడింది. అతని ఖాతా జల్లెడ పట్టారు. ఒక ఫొటోలో రెబెల్లో ఎర్ర స్వెటర్ వేసుకుని కనబడ్డాడు. ఫేస్బుక్ ఖాతా ఇంకా వెతగ్గా ఒకచోట విజిటింగ్ కార్డు దొరికింది. అందులో రెబెల్లో అడ్రెస్, ఫోన్ నంబర్ ఉన్నాయి.
పోలీసులు వెంటనే శాంతాక్రజ్ ప్రాంతంలోని ఆ అడ్రసుకు వెళ్లారు. రెబెల్లో స్నేహితులుగా నటిస్తూ స్థానికులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా రెబెల్లో కనబడడం లేదనీ అతనికి ఆరాధ్య అనే పెంపుడు కుమార్తె ఉందనీ వారు చెప్పారు. పోలీసులు ఆరాధ్యను ప్రశ్నించారు. తన తండ్రి కెనడా వెళ్లాడని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసులు వదలలేదు. గంటల తరబడి ప్రశ్నించడంతో ఆరాధ్య చివరికి నిజం ఒప్పుకుంది.
ఒకసారి నిజం ఒప్పుకున్న తర్వాత ఆ యువతి చెప్పిన వివరాలు విని క్రయింబ్రాంచ్ పోలీసులే నివ్వెర పోయారు. డిసిపి (పరిశోధన) షాహాజీ ఉమప్ కథనం ప్రకారం నవంబర్ 26వ తేదిన ఆరాధ్య, ఆమె బాయ్ఫ్రెండ్ కలిసి ఇంట్లోనే రెబెల్లోను కర్రలతో చితకబాదారు. స్పృహ తప్పిన రెబెల్లోను కత్తులతో పొడిచారు. అతని సెల్ఫోన్ తీసుకుని వెళ్లి దానిని 4,500 రూపాయలకు అమ్మారు. ఆ డబ్బుతో నాలుగు మాసం నరికే కత్తులు, రూం ఫ్రెషనర్ బాటిళ్లు కొనుక్కొచ్చారు. తర్వాత మూడు రోజుల పాటు రెబెల్లె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. దుర్వాసన బయటకు వెళ్లకుండా ఫ్రెషనర్ చల్లుతూ పోయారు.
శరీర భాగాలను మూడు సూట్కేసుల్లో సర్ది డిసెంబర్ ఒకటవ తేదీన ఇద్దరూ కలిసి వాటిని తీసుకువెళ్లి మితి నదిలో పడేశారు. మితి నది మహిం దగ్గరే అరేబియా సముద్రంలో కలుస్తుంది. సముద్రంలోకి కొట్టుకుపోయిన సూట్కేసుల్లో ఒకటి మరుసటి రోజు ఒడ్డుకు వచ్చింది. పెంపుడు తండ్రి తనను లైంగికంగా వాడుకుంటున్నాడనీ, అందుకే అతనిని హతమార్చాననీ ఆరాధ్య పోలీసులకు చెప్పింది. ఆమె మాటల్లో నిజం ఎంతో దర్యాప్తు చేస్తున్నామని షాహాజీ ఉమప్ పేర్కొన్నారు.