అమరావతి, మార్చి 30: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు రాష్టంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో వైసిపి 18నుండి 20 వరకూ సాధించే అవకాశం ఉందని వెల్లడిస్తుండటం ఆ పార్టీ వర్గాలలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. నామినేషన్ల పర్వానికి ముందు అధికార పార్టీ నుండి కూడా ఎక్కువ సంఖ్యలో వైసిపికి వలసలు వచ్చారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఉన్న పార్టీలో ఆశించిన సీటు రాకపోతే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడం జరుగుతుంటుంది. అయితే అధికార పార్టీలో టికెట్ ఖరారు అయినా, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నాయకులు సైతం కొందరు అధికార పార్టీని వీడి ప్రధాన ప్రతిపక్ష పార్టీలో చేరారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలలో టిడిపి, వైసిపితో పాటు కాంగ్రెస్, బిజెపి, జనసేన, ప్రజాశాంతి తదితర పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నా ప్రధానమైన పోటీ టిడిపి, వైసిపి మధ్యే జరుగుతున్నది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కొన్ని సీట్లలో మాత్రం టిడిపి, వైసిపి, జనసేన మధ్య ముక్కోణపు పోటీ జరుగుతుందని భావిస్తున్నారు.
ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈసారి ఏ విధంగానైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుని ప్రచార పర్వాలను కొనసాగిస్తున్నారు.
ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరగా టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు రోజు రెండు జిల్లాలలో రోడ్షోలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటివరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి టిడిపి గెలుపునకు కారణం అవుతాయని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబును ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎన్నికలకు ముందు నవరత్న పథకాలను కాపీ కొట్టి చంద్రబాబు అమలు చేసినా ఇక ప్రజలు ఆయనను బలపరిచే అవకాశం లేదని, వైసిపికి అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో వైసిపి అధికారానికి దూరం అయ్యింది.
2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ప్రచారం చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ 102 స్థానాలు కైవశం చేసుకుంది. నేటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అటు బిజెపి, ఇటు జనసేన పార్టీలు రెండూ దూరం అయ్యాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరికి వారు తమదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా ముక్కోణపు పోటీలో తమ పార్టీకి వచ్చే సీట్లే అధికారానికి కీలకం అవుతాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన భావిస్తున్నది.
వైసిపి వెనుక టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉన్నాడని, వైసిపికి ఓటు వేస్తే కెసిఆర్కు అధికారం అప్పగించినట్లేనని చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్, జగన్లు పరోక్షంగా మోదీకి మద్దతు ఇచ్చేవారంటూ కూడా చంద్రబాబు ఎన్నికల సభల్లో మైనార్టీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబును మరో సారి నమ్మితే నరమాంసం తినే అందమైన రాక్షసికి అధికారం ఇచ్చినట్లేనని జగన్ పేర్కొంటున్నారు. ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతున్నా అధికార ప్రతిపక్ష నేతలు ఇద్దరూ ఎన్నికల మానిఫెస్టోను ప్రకటించలేదు. వారం రోజులుగా మానిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసినా తరువాత విడుదల చేసే వారు కాపీ కొడతారని బావించి ఎవరికి వారు మానిఫెస్టో విడుదలపై జాప్యం చేస్తున్నారు. అయినా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఇద్దరు నేతలు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా వరాలను కురిపిస్తునే ఉన్నారు.