న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ పిటిషన్ను కేంద్ర హోంశాఖ గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్ దరఖాస్తును రాష్ట్రపతి రామ్ నాథ్ శుక్రవారం తిరస్కరించారు.
నిజానికి నిర్భయం కేసులో నలుగురు దోషులకు జనవరి 7న ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జవవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. అయితే నిందితుల్లో ఒకడైన ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఈ ఉరితీత అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, తాజాగా ముఖేశ్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలంటూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టును కోరారు. దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్ వారెంట్ జారీ చేయాలని పేర్కొన్నారు. దీంతో కోర్టు నలుగురు దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సిందిగా కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.
అంతకుముందు.. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఘటన సమయంలో తాను బాల నేరస్థుడినని, దాని ప్రకరమే విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ (26), ముకేశ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ జనవరి 9న తమకున్న చిట్ట చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై మంగళవారం(జనవరి 14) ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే, క్షమాభిక్ష కోరుతూ ముకేశ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అభ్యర్థిన సమర్పించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరిశిక్ష పడిన కేసులో దోషులు క్షమాభిక్ష పిటిషన్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని తెలిపింది. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22న ఉరితీయలేమని స్పష్టం చేసింది. అయితే, తాజాగా ముఖేశ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిస్కరించడంతో ఉరిశిక్ష అమలుక కొత్త తేదీ ఖరారు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ.. డిసెంబర్ 29న ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్, వినయ్ శర్మ, పవన్, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం నలుగురు దోషులు ఢిల్లీలోని తీహార్ జైలులోఉన్నారు.