(న్సూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ మరణశిక్షను ఎదుర్కొంటున్న నిర్భయ కేసు దోషులలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నలుగురు దోషులలో ఒకరైన పవన్ కుమార్ గుప్తా, నేరం జరిగిన సమయానికి తాను మైనర్నని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఈ వాదనను తోసిపుచ్చారనీ, మళ్లీ అదే వాదనను లేవనెత్తడం కుదరదనీ సుప్రీంకోర్టు పేర్కొన్నది. పవన్ వాదనను గతంలో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు జరిగే రోజును రెండవసారి శుక్రవారం నాడు ప్రకటించారు. అదే రోజు పవన్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. సోమవారం సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. ఒక వాదన ఎన్నిసార్లు లేవనెత్తుతారని కోర్టు ప్రశ్నించింది. నిర్భయ కేసు నిందితులను ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరింటికి ఉరి తీయనున్నారు.
వీరిని గత బుధవారం ఉరి తీయాల్సి ఉంది. అయితే ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఉరి వాయిదా వేశారు. తాజాగా మరో తేదీ ప్రకటించారు. నిర్బయపై అత్యాచారం జరిపిన ఆరుగురిలో ఒకరు మైనర్ కావడంతో విడిగా విచారించి శిక్ష విధించారు. అతను శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదల కూడా అయ్యాడు కూడా. మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.