అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి, విశాఖ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణకు తాము సహకరిస్తామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ కు సూచించారు. రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పారు. దీని నిర్మాణానికి ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని తెలిపారు.
అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ఎన్నోఅసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఉంటుందా? ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండరని, ఇంకొక సీఎం వస్తారని అప్పుడు మళ్లీ రాజధాని మారుస్తారా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడైనా.. ప్రధాని అయినా, ముఖ్యమంత్రులు అయినా రాజధానిని మార్చారా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు తెలిసి ఒక్క తుగ్లక్ మాత్రమే రాజధాని మార్చారని నిమ్మల రామానాయుడు చెప్పారు.