అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు ఏదో విషయమై మాట్లాడారు. ఇద్దరూ సీరియస్ గా ఏదో అంశంపై తీవ్రంగా చర్చించినట్లు కనిపించింది. అనంతరం తన పూర్వ స్థానంలో కూర్చున్నారు. రాపాక చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. సభ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సన్నివేశం చర్చనీయాంశమయ్యింది.
మరోవైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు. అసెంబ్లీకి బిల్లు వస్తే అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకించాలని కోరుతూ ఓ లేఖ రాశారు.
కాగా, రాపాక కొన్నాళ్లుగా వైసీపీ అనుకూల వైఖరి కనబరుస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతు పలకడమే కాదు, జగన్ ఫొటోలకు పాలాభిషేకం చేయడం వంటి చర్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.