(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమను అరెస్టు చేసినా ఆందోళన విరమించేది లేదనీ స్పష్టం చేస్తూ పోలీస్ వాహనంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఎం డౌన్ డౌన్, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
మరో వైపు వెలగపూడి.తుళ్లూరు,ఎర్రబాలెంలోనూ మహిళలు, రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరి నిరసనను పోలీసులు అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించడంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మరో వైపు గ్రామంలో ధర్నా చేయడానికి వీలులేదంటూ రైతులు వేసిన షామియానాలను పోలీసులు తొలగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థతి నెలకొన్నది. అరెస్టు చేసిన రైతులు, మహిళలను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తుళ్లూరులో రోడ్డుపై పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.